టెహ్రాన్: తమ విస్తృత ప్రాంతీయ శాంతి ప్రణాళికలలో గాజాకు ఇబ్బందులు తప్పకపోవచ్చని ఇరాన్ ఉన్నతాధికారులు సంకేతాలు ఇచ్చారు. కొనసాగుతున్న కాల్పుల విరమణ, దౌత్య ప్రయత్నాలతో గాజాకు సంబంధం ఉందని వారు పేర్కొన్నారు. ఈమేరకు IRGCకు చెందిన ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ మాట్లాడుతూ… గాజా మరో ఘర్షణ క్షేత్రంగా మారవచ్చని సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్’లో హెచ్చరించారు.
“హిజ్బుల్లా వద్ద డ్రోన్లు ఉన్నాయని మేము చెప్పినప్పుడు, ఇజ్రాయెల్ పట్టించుకోలేదు, అందుకే చిక్కుకున్నారు. 100 మంది మృతులకు ఎవరు సమాధానం చెబుతారు?” అని హిజ్బుల్లా యుద్ధరంగ సామర్థ్యాలను ప్రస్తావిస్తూ ఖానీ రాశారు.
అదేసమయంలో ఆయన గాజా గురించి ప్రస్తావిస్తూ…”గాజాలో కూడా దానికంటూ ఒక తుఫాను ఉంది. మీరు మీ రాజకీయ నాయకుల మార్గాన్ని అనుసరిస్తే, మీరు కూడా ఆ తుఫానులో చిక్కుకుంటారు. జాగ్రత్తగా ఉండండి అని ఖానీ రాసుకొచ్చారు.”
ఈ వారం అమెరికాతో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబ్జాదే అల్ జజీరాతో మాట్లాడుతూ…”మేము గాజాతో సహా అన్నిచోట్ల శాంతిని సాధించడానికి కృషి చేస్తున్నాము, యుద్ధంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నందున మేము లెబనాన్ను ఈ అవగాహన ఒప్పందంలో చేర్చామని చెప్పిన కొద్దిసేపటికే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రాంతీయ ఆధిపత్యాన్ని కోరుకోవడం లేదని, ఈ ప్రాంతంలోని అన్ని దేశాలతో ఉమ్మడి ప్రయోజనాలను పంచుకుంటుందని కూడా ఆయన పేర్కొన్నారు.
గాజా మారణకాండ
మరోవంక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ శాంతి కోసం ఒక అవగాహన ఒప్పందంపై ఎలక్ట్రానిక్గా సంతకం చేశారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన సంఘర్షణను ముగించడానికి, అలాగే హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఈ ఒప్పందంతో మార్గం సుగమమైంది.
ఈ ఒప్పంద పత్రం లెబనాన్తో సహా అన్ని చోట్ల సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చింది, కానీ గాజా గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. 2023 నుండి ఇజ్రాయెల్ జరిపిన మారణహోమంలో గాజాలో దాదాపు 80,000 మంది పాలస్తీనియన్లు మరణించారు, 23 లక్షల మంది జనాభాలో దాదాపు అందరూ నిరాశ్రయులయ్యారు, 90 శాతం మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.
ఇజ్రాయెల్ మారణహోమంలో మరణించిన వారి సంఖ్యను వాస్తవానికి చాలా తక్కువగా చూపిస్తున్నారని, చనిపోయిన లేదా గాయపడిన పాలస్తీనియన్ల అసలు సంఖ్య 2 లక్షలకు పైగా ఉండవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు ప్రస్తుతం గాజాలో సగానికి పైగా భూభాగాన్ని ఆక్రమించుకుని, మరింత భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నాయి.
ఇజ్రాయెల్, హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన గత ఎనిమిది నెలల్లో గాజాలోని ఇజ్రాయెల్ సైనికులు 1,005 మంది పాలస్తీనియన్లను హతమార్చారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
ఇదిలా ఉండగా, లెబనాన్పై ఇజ్రాయెల్ దండయాత్ర అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. దక్షిణ లెబనాన్లో నలుగురు ఇజ్రాయెల్ సైనికులను హిజ్బుల్లా హతమార్చిన తర్వాత, శుక్రవారం ఇజ్రాయెల్ దళాలు కనీసం 50 మంది లెబనీయులను హతమార్చాయి.

