వాషింగ్టన్: ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య శాంతి స్థాపన దిశగా అమెరికా మధ్యవర్తిత్వంలో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. వాషింగ్టన్లో నాలుగు రోజుల పాటు సాగిన సుదీర్ఘ చర్చల అనరంతరం ఇరుదేశాల రాయబారులు దీనిపై సంతకాలు చేశారు. ఈ ప్రాంతంలో “శాశ్వత శాంతిని ప్రోత్సహించే లక్ష్యంతో అమెరికా ఒక ఫ్రేమ్వర్క్ ఒప్పందాన్ని కుదిర్చిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సైతం ప్రకటించారు.
ఈ ఒప్పందం ప్రకారం… హిజ్బుల్లా అన్ని దాడులను నిలిపివేసి, దక్షిణ లెబనాన్ నుండి వైదొలిగితే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది. వాషింగ్టన్, డి.సి.లో అంతకుముందు ఖరారు చేసిన ఈ ఒప్పంద పత్రాన్ని అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసినట్లు అల్ జజీరా నివేదించింది.
ఒప్పందంలోని రెండవ నిబంధన ప్రకారం, ఇజ్రాయెల్-లెబనాన్ ప్రభుత్వాలు “పరస్పర, క్రమబద్ధమైన ప్రక్రియకు కట్టుబడి ఉంటాయి”, దీని కింద లెబనీస్ సైన్యం “లెబనీస్ భూభాగం మొత్తంపై సమర్థవంతమైన సార్వభౌమ అధికారాన్ని పునరుద్ధరిస్తుంది”.
ఈ ప్రక్రియ ఇజ్రాయెల్ సైన్యం లెబనీస్ భూభాగం నుండి క్రమంగా వైదొలగడానికి వీలు కల్పిస్తుంది” అని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైన్యానికి, లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూప్నకు మధ్య కొన్ని నెలలుగా సాగుతున్న భీకర పోరాటానికి ముగింపు పలికి, భవిష్యత్తులో మరింత విస్తృతమైన శాంతి ఒప్పందం కుదిరేందుకు ఈ పరిణామం ఒక మంచి ముందడుగు అని విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా, అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యెహీల్ లైటర్ ఈ చర్చల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేసమయంలో అమెరికాలో లెబనాన్ రాయబారి నాదా హమాదే మాట్లాడుతూ.. ఈ చర్చలకు అమెరికా ఆతిథ్యమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంగా అమెరికా పర్యవేక్షణలో కుదిరిన ఈ తాజా ఒప్పందం పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలను తొలగించడానికి ఒక ఆశాకిరణంగా నిలిచింది.


