వాషింగ్టన్: యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమానవాహక నౌకలోని అమెరికన్ నావికులు తీవ్ర నిరాశ, అలసటతో ఆత్మహత్యలకు (సముద్రంలో దూకి ప్రాణాలు తీసుకునేందుకు) యత్నించినట్లు నివేదికలు వెల్లడించాయి. మిలిటరీ టైమ్స్ నివేదిక ప్రకారం…నావికులు నెలల తరబడి సముద్రంలో ఉండటం, క్షీణిస్తున్న జీవన పరిస్థితులు, పదేపదే మోహరింపు పొడిగింపులు సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, నౌకలో అనేక ఆత్మహత్యాయత్నాలు జరిగాయని చెబుతున్నాయి.
USS అబ్రహం లింకన్ నౌక ఇప్పుడు తొమ్మిది నెలలుగా సముద్రంలో ఉంది, ఇందులో రికార్డు స్థాయిలో వరుసగా 250 రోజులుగా అసలు భూమిని చేరనేలేదు. దానిలోని సుమారు 5,000 మంది నావికులు, మెరైన్లకు ఈ ఒత్తిడిని భరించడం రోజురోజుకు కష్టతరం అవుతోంది.
ఈమేరకు గత గురువారం శాన్ డియాగోలో జరిగిన ఒక భావోద్వేగభరితమైన టౌన్ హాల్ సమావేశంలో, విమాన వాహక నౌకలో పెరుగుతున్న సంక్షోభంపై సుమారు 200 మంది కుటుంబ సభ్యులు సీనియర్ నేవీ అధికారులను నిలదీశారని స్టార్స్ అండ్ స్ట్రైప్స్ నివేదించింది.
ఒక మహిళ తాత్కాలిక నేవీ సెక్రటరీ హంగ్ కావోతో మాట్లాడుతూ… ఆ రోజు తన భర్త, “రేపు తాను మేల్కొనకూడదని ఆశిస్తున్నాను” అని సందేశం పంపినట్లు చెప్పింది.
మరో కుటుంబ సభ్యుడు, ఒకప్పుడు సైన్యంపై కుటుంబాలకు ఉన్న విశ్వాసాన్ని నేవీ నాయకత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. “మాకు, నాయకత్వానికి మధ్య ఉన్న నమ్మకాన్ని నావికాదళం దెబ్బతీసింది” అని ఆమె అన్నారు.
తన మోహరింపును పదేపదే పొడిగించడంతో, తన భర్త సముద్రంలోకి దూకడానికి ప్రయత్నించాడని అన్నాబెల్ లోమా మిలిటరీ టైమ్స్కు చెప్పారు. అతను అలసిపోయాడని, తన కెరీర్కు ఏమవుతుందోనని భయపడ్డాడని ఆమె అన్నారు.
“అతను భయపడుతున్నాడు. అతనికి అగౌరవకరమైన డిశ్చార్జ్ ఇస్తారని, కేవలం అతను అలసిపోయినందువల్ల తన 13 ఏళ్ల కెరీర్ అలా నాశనమైపోతుందని అతను అనుకుంటున్నాడు,” అని ఆమె అన్నారు.
మరో సంఘటనలో, ఒక నావికుడి భార్య ఆ పత్రికకు మాట్లాడుతూ, తన భర్త తోటి సిబ్బందిని సముద్రంలోకి దూకకుండా ఆపాడని చెప్పారు. అతను ఆ నావికుడిని పట్టుకుని తిరిగి డెక్పైకి లాగాడు. ఈ సంఘటనలు, సుదీర్ఘ మోహరింపు కొంతమంది సిబ్బందిని వారి పరిమితులకు మించి నెడుతోందనే ఆందోళనలను మరింత పెంచాయి.
భూమికి దూరంగా 250 రోజులు
అమెరికా విమాన వాహక నౌక నవంబర్ 21న శాన్ డియాగో నుండి బయలుదేరింది, వాస్తవానికి అది పసిఫిక్కు వెళ్లాల్సి ఉంది. కానీ ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఆ నౌకను మధ్యప్రాచ్యానికి మళ్లించారు.
అప్పటి నుండి సిబ్బందికి తీరంలో గడిపిన సమయం చాలా తక్కువగా ఉంది. MS నౌ ప్రకారం, 5,000 మందికి పైగా నావికులు, మెరైన్లు భూమిపై కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నారు; డిసెంబర్లో గ్వామ్లో ఒకసారి, జూలైలో ఒమన్లో మరోసారి. ఈ మోహరింపు వాస్తవానికి మే నెలలో ముగియాల్సి ఉంది. అయితే, యుద్ధం కొనసాగుతున్నందున దీనిని చాలాసార్లు పొడిగించారు. ఈ విమాన వాహక నౌక ఇప్పుడు ఇరాన్పై ఐదవ నెల పోరాట కార్యకలాపాలలో ఉంది.
‘బూజు పట్టిన షవర్లు, పాడైన టాయిలెట్లు’
ఈ మానసిక ఒత్తిడితో పాటు, నౌకలోని ప్రాథమిక జీవన పరిస్థితులపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ లెవిన్, ‘X’ నౌకలో సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు.
ఆ నౌకలో “బూజు పట్టిన షవర్లు, పాడైన టాయిలెట్లు, వారాల తరబడి పనిచేయని లాండ్రీ, చాలా కాలం పాటు వేడినీరు లేకపోవడం, అర కప్పు అన్నం, రెండు టోర్టిల్లాలతో సరిపెట్టే భోజనం. సబ్బు, డియోడరెంట్, టూత్పేస్ట్ లేకపోవడం” వంటివి ఉన్నాయి.
ఏప్రిల్లో, నాణ్యత లేని, రేషన్ పద్ధతిలో ఇస్తున్న ఆహారానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అదే సమయంలో నీటి కొరత, బూజు పట్టిన షవర్లు, పాడైన లాండ్రీ మెషీన్ల గురించి కూడా నివేదికలు వివరించాయి. కాగా, ఆ సమయంలో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ నివేదికలను “మరిన్ని నకిలీ వార్తలు” అని కొట్టిపారేశారు.
“ఈ నావికులు తమ దేశానికి సేవ చేయడానికి ముందుకొచ్చారు. వారికి కనీసం వేడి నీళ్లు, పనిచేసే మరుగుదొడ్డి, అలాగే మంచి భోజనం కల్పించడం దేశం కనీస బాధ్యత. హెగ్సెత్ కనీసం ఆ ఏర్పాట్లు కూడా చేయలేకపోయాడు, పైగా వారి కుటుంబ సభ్యుల కళ్లలోకి సూటిగా చూస్తూ వారిని అబద్ధాలకోరులని పిలిచే ధైర్యం చేస్తున్నాడని” డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ లెవిన్ అన్నారు.

