హైదరాబాద్: బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు 10 రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్లో 10 గ్రాములకు రూ.60,320 మార్కు వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్లకు గోల్డ్ 10 గ్రాములకు రూ.55,300 వద్ద స్థిరంగా ఉంది.
గడిచిన 10 రోజుల్లోనే 10 గ్రాముల ధర దాదాపు రూ.5,000 పుంజుకోవడం గమనార్హం. ఈ క్రమంలో తర్వలోనే మునుపెన్నడూ లేనివిధంగా తులం విలువ రూ.70,000లను తాకవచ్చన్న అంచనాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.
అమెరికాలో బ్యాంకింగ్ వ్యవస్థ ప్రభావంతో డాలర్ పడిపోయి.. గోల్డ్ రేటు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అమెరికా, యూరప్ల్లో ప్రధాన బ్యాంకులు మూతబడటంతో స్టాక్ మార్కెట్లపై మదుపరుల్లో విశ్వాసం సన్నగిల్లిందని, దీంతో క్యాపిటల్ మార్కెట్ల నుంచి వారు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని, ఈ పెట్టుబడులను తిరిగి బంగారం వైపు మళ్లిస్తున్నారని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇన్వెస్టర్లకు ఇప్పుడు పుత్తడి ఓ సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉందని అంటున్నారు. పైగా ఈ బ్యాంకింగ్ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చేదాకా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని అంచనా వేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ఏడాది కిందట ఔన్సు బంగారం ధర 2,052 డాలర్లను తాకినది తెలిసిందే.
మొన్నటికి మొన్న వరుసగా తగ్గి ఉపశమనం కల్పించినట్లే అనిపించినా.. మళ్లీ జీవన కాల గరిష్టాలకు ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1975 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు విషయానికి వస్తే ఔన్సుకు 22.36 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవి వారం కింద వరుసగా 1800 డాలర్లు, 19 డాలర్ల వద్ద ఉండేవి. ఇక రూపాయి మారకం విలువ ప్రస్తుతం డాలర్తో పోలిస్తే స్థిరంగా రూ.82.595 వద్ద ఉంది.