కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి సెలవులను జనవరి 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ స్కూళ్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ,జనవరి 24 నుంచి పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. 8,9,10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వాహిచాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇక ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో 50 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాఠశాలలకు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు. విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ క్లాసులకు సర్కారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే.
ఈసారి ఇంటర్ మరియు 10వ తరగతి పరీక్షలు రద్దు చేసే ప్రసక్తి లేదని , మే నెలలో ఇంటర్ మరియు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నామని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది.