న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ ఫ్యాకల్టీలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో వైస్-ఛాన్సలర్ యోగేష్ సింగ్కు వ్యతిరేకంగా విద్యార్ధులు నిరసన వ్యక్తం చేసారు, ‘వీసీ గో బ్యాక్’ అంటూ నినాదాలు కూడా చేశారు.
సత్య నికేతన్లో విద్యార్థులు నివసిస్తున్న పీజీ హాస్టల్ భవనం కూలిపోవడంతో ఐదుగురు విద్యార్థులు మరణించిన ఘటనపై, అధికారికంగా సంతాప దినాలు ప్రకటించనందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం పాలక కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థులు ఆరోపించారు. DU విద్యార్థులకు ప్రైవేట్ పీజీ వసతి కల్పిస్తున్న ఆ భవనం సెప్టెంబర్ 6న కూలిపోయింది. కళాశాల హాస్టళ్లలో పడకల కొరత కారణంగా, తమ కళాశాలల సమీపంలోని శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసిస్తున్న వందలాది మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు.
నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) సభ్యుల నేతృత్వంలో జరిగిన నిరసనలో, విద్యార్థుల భద్రతను మెరుగుపరచాలని, ప్రైవేట్ వసతుల నిర్మాణ తనిఖీలు జరపాలని, అందుబాటు ధరలలో విశ్వవిద్యాలయ హాస్టల్ సౌకర్యాలను విస్తరించాలని డిమాండ్లు లేవనెత్తారు.
భద్రతా సిబ్బంది, పోలీసులు జోక్యం చేసుకుని, నిరసనకారులను బయటకు తీసుకువెళ్లడానికి ముందు, ప్రదర్శనకారులు ఆడిటోరియం లోపల “వీసీ గో బ్యాక్”, “పీజీ హాస్టల్ ఏర్పాటు చేయండి” అంటూ నినాదాలు చేశారు.
ఇదిలా ఉండగా, సత్య నికేతన్లోని అక్రమ పీజీ వసతులను బీజేపీ ఎమ్మెల్యే అనిల్ శర్మ కాపాడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆయన ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
ఒక పత్రికా సమావేశంలో ఆప్ నాయకులు సంజీవ్ ఝా, కుల్దీప్ కుమార్, అనురాగ్ ధండా మాట్లాడుతూ… 1986 భూ రికార్డుల ప్రకారం ఆయన తండ్రికి 307 చదరపు గజాల భూమి కేటాయిస్తే, ఆ ప్రాంతంలో శర్మకు అంత పెద్ద ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
అక్రమ పీజీలపై చేపట్టే ఏ కూల్చివేత చర్య అయినా శర్మ ఆస్తితోనే ప్రారంభం కావాలని వారు డిమాండ్ చేశారు. సత్య నికేతన్ ఉన్న ఆర్కే పురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శర్మ, ఆ భూమి తన పూర్వీకుల ఆస్తి అని, దానికి సంబంధించిన రిజిస్ట్రీ, సేల్ డీడ్ తన వద్ద ఉన్నాయని చెబుతూ ఆ ఆరోపణలను ఖండించారు.


