హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ నగరవాసులకు మరింత సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి తీసుకువచ్చింది. నగరంలో పర్యావరణ హితమైన బస్సులను అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్ఎంసీ పరిథిలో నేటినుంచి ‘గ్రీన్ మెట్రో లగ్జరీ’ ఏసీ బస్సులు పరుగులు తీయనున్నాయి.
మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో మొదటి విడతగా బుధవారం 25 బస్సులను ప్రారంభించనున్నారు. మిగిలిన 25 బస్సులు నవంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణతో పాటు ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందజేయనున్నారు. వీటిని గచ్చిబౌలి స్టేడియం సమీపంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించనున్నారు.
12 మీటర్ల పొడవైన ఆకుపచ్చ లగ్జరీ AC బస్సులు అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు ఈ బస్సుల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. మొబైల్ ఛార్జింగ్ సౌకర్యాలు, రీడింగ్ ల్యాంప్లతో కూడిన 35 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రయాణీకుల భద్రత కోసం, TSRTC కంట్రోల్ రూమ్కు అనుసంధానించబడిన వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్తో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సౌకర్యం ఉంది.
ప్రతి బస్సులో రెండు CCTV కెమెరాలు అమర్చారు. వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంది. బస్సు రివర్స్ చేసుకునేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంది. బస్సు ముందు, వెనుక భాగంలో ఎల్ఈడీ బోర్డులు ఉన్నాయి. ఇందులో గమ్యస్థానాల వివరాలు ఉంటాయి. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారాన్ని చేరవేసేందుకు బస్సుల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ సైతం ఉంటుంది.