హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదాపడ్డ గ్రూప్-2 పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7వ తేదీల్లో నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించడం కష్టమని టీఎస్పీఎస్సీ వీటిని వాయిదా వేసిన విషయం తెలిసిందే.
జనవరి 6, 7 తేదీల్లో ఉదయం గం.10 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం గం. 2.30 నుంచి 5.00 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
గ్రూప్-2 పరీక్షల కోసం 1600 కేంద్రాలు అవసరం అవుతాయని, దాదాపు 25 వేల మంది పోలీసులు, మరో 20 వేల మందికిపైగా సిబ్బంది అవసరం అవుతారని టీఎస్పీఎస్పీ భావించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఓ వైపు ఎన్నికలకు, మరోవైపు పరీక్షలకు సిబ్బందిని కేటాయించడం సాధ్యంకాదని భావించిన కమిషన్ సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది.
పరీక్ష నిర్వహణకు అవసరమైన సిబ్బంది, పోలీసు సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేయాల్సి వచ్చింది.
మొదట, డిసెంబర్ నెలలో పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కమిషన్ భావించింది. అయితే, అదే నెలలో ఇతర పరీక్షలు వరుసలో ఉండటంతో గ్రూప్ – II ను జనవరికి వాయిదా వేసింది.
తెలంగాణలో గ్రూప్-2 క్యాటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి నిరుడు జనవరి 18న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రస్థాయిలో గ్రూప్-1 తర్వాత ఎంతో కీలకమైనది గ్రూప్-2 కావడంతో అభ్యర్థులు భారీగా పోటీపడ్డారు. అత్యధికంగా 5,51,943 దరఖాస్తులు వచ్చాయి.