న్యూఢిల్లీ: భారతదేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వివాహానికి ప్రాథమిక హక్కు లేదని ఏకగ్రీవంగా అంగీకరించింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధమైనవిగా గుర్తించడం పార్లమెంట్, రాష్ట్ర శాసన సభల పని అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్వలింగ వివాహాల చట్టబద్ధత’పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహ సభ్యులుగా ఉన్న ఈ ధర్మాసనం మొత్తం నాలుగు అంశాలపై తీర్పులను ప్రకటించింది. పలు అంశాలపై సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ కౌల్తో జస్టిస్ భల్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ నరసింహ విభేదించారు. మరో ఇద్దరు న్యాయమూర్తులు స్వలింగ జంటలకు పిల్లలను దత్తత తీసుకునే హక్కు ఉండాలని కూడా వాదించారు.
మరోవైపు, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, హిమా కోహ్లి, పిఎస్ నరసింహలు జ్యుడీషియల్ డిక్టాట్ ద్వారా పౌర యూనియన్ హక్కును సృష్టించడం కష్టమని వాదించారు. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ నిర్దేశించిన నిబంధనలు రాజ్యాంగబద్ధమైనవని, CJI గమనించినట్లుగా చెల్లవని కూడా వారు అంగీకరించారు.
స్వలింగ సంపర్కులపై ఏరకంగానైనా వివక్ష ఉంటే.. వాటిని అధ్యయనం చేసి పరిష్కరించేందుకు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేస్తామని కేంద్రప్రభుత్వం తన అఫిడవిట్లో తెలిపిందని, దానిని రికార్డుల్లోకి తీసుకొంటున్నామని చెప్పారు.
స్వలింగ సంపర్కులు (ఎల్జీబీటీక్యూఏప్లస్ప్లస్) సహజీవనం చేయటం నేరం కాదంటూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేలా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఫారిన్ మ్యారేజ్ యాక్ట్లో మార్పులు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో 18 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు వెలువడింది. ఎల్జీబీటీల కోసం చట్టాలను మార్చటం కుదరదని ధర్మాసనం తేల్చిచెప్పింది.