హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) గురువారం హైదరాబాద్లోని పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.
మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కే లక్ష్మారెడ్డి, బడంగ్పేట మేయర్గా ఉన్న ఆయన మద్దతుదారుడు చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
మహేశ్వరంలో బీఆర్ఎస్ నేత, మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కే లక్ష్మారెడ్డిని పోటీకి దింపింది, వీరికి ఏఐఎంఐఎం మద్దతు కూడా ఉంది. I-T సోదాలు జరుగుతున్నప్పుడు పార్టీ కార్యకర్తలు లక్ష్మా రెడ్డి ఫామ్హౌస్ వెలుపల నిరసనకు దిగారు.
పారిజాత ప్రస్తుతం తిరుపతిలో ఉండగా, ఆమె భర్త నరసింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. బాలాపూర్లోని ఆమె ఇంట్లో దాదాపు ఆరుగురు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు చేసే సమయంలో నరసింహారెడ్డి ఇంట్లో తల్లి, కూతురు ఉన్నారు. పారిజాత కుటుంబం, బంధువులు, కార్యాలయాలు కలిపి మొత్తం 10 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
పారిజాత గతేడాది టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)కి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ఆమె హైదరాబాద్ శివార్లలో కొత్తగా ఏర్పడిన మునిసిపల్ కార్పొరేషన్ బడంగ్పేటకు మేయర్.
తమ నేతలపై ఐటీ దాడులు జరగడాన్ని కాంగ్రెస్ విమర్శించింది. బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపినట్లు ఇది రుజువు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులను మానసికంగా వేధించడమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు.
ఓవైపు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూనే ప్రత్యర్థులను ఎలా ఓడించాలనే వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రచారంలో కీలక నేతలు ప్రజల వద్దకు వెళ్లి తాము చేసిన మంచి పనులు ప్రత్యర్థులు లోపాలను ఎత్తి చూపుతూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఐటి దాడులు కలకలం రేపుతున్నాయి. 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.