ప్రధానాంశాలు
- విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
- కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ స్కూళ్లు
- ‘మనఊరు-మనబడి’తో మహర్దశ
- గుణాత్మక విద్యవైపు అడుగులు
- ముఖ్యమంత్రి అల్పాహార పథకం
హైదరాబాద్: రాష్ట్రంలో ‘సర్కారు విద్య’కు తెలంగాణ ప్రభుత్వం జీవం పోసింది. రూ.కోట్లాది నిధులు వెచ్చించి అన్ని పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించింది. అవసరమున్న చోట్ల కొత్త తరగతి గదులు, అదనపు గదులు నిర్మించింది. బోధనా పద్ధతుల్లోనూ అనేక మార్పులు చేసింది. ఆంగ్లమాధ్యమాన్ని అమలు చేస్తున్నది. కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా గురుకులాలను నెలకొల్పింది.
అంతేకాదు ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభించడం, ‘మన ఊరు-మన బడి’ కింద పాఠశాలల పునరుద్ధరణ, ఎన్రోల్మెంట్ పెంపుదల, ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లో ఉచిత నోట్బుక్లు, వర్క్బుక్లను పంపిణీ చేయడం… లాంటి విప్లవాత్మక మార్పులతో తెలంగాణ పాఠశాల విద్యా రంగం విరాజిల్లుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల ప్రారంభించిన ఉచిత అల్పాహార పథకం 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వరంగా మారింది. ఇప్పటికే విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందజేస్తుండగా, ఇప్పుడు వారికి ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నారు.
విద్యార్థుల పౌష్టికాహారంపై దృష్టి సారించి వారానికి మూడు కోడిగుడ్లతో పాటు సాయంత్రం పూట పోషకాలతో కూడిన రాగి జావను కూడా అందజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యలో ఉచిత యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, భోజనం కూడా ఉంటాయి.
ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద పాఠశాలలకు మంచినీటి సౌకర్యం, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, ఫర్నీచర్, మొత్తం పాఠశాలలకు పెయింటింగ్, పచ్చటి చాక్బోర్డ్, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్లు, శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్త తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో భోజనశాలలు తదితర 12 భాగాల కింద పాఠశాలలను తీర్చిదిద్దారు.
కార్యక్రమంలో మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృష్టి సారించారు.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా దెబ్బతిన్న అకడమిక్ పనితీరు ఇప్పుడు ట్రాక్లో పడింది. 1 నుండి 5 తరగతులకు పునాది అక్షరాస్యత, సంఖ్యా కార్యక్రమం, 6 నుండి 9 తరగతులకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కూడా చేపట్టారు.
మరోవంక ‘చెలిమి’ ద్వారా విద్యార్థుల్లో లైఫ్ స్కిల్స్ పెంచేందుకు చొరవ తీసుకున్నాయి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, ఒత్తిడి, వైఫల్యాలను ఎలా అధిగమించాలో నేర్పించారు. ఇంకా, విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు, వారిలో వినూత్న వ్యాపార ఆలోచనలను తీసుకురావడానికి, ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాపార ఆవిష్కరణ కార్యక్రమం ‘అంకురం’ ప్రారంభించారు.