న్యూఢిల్లీ: రిచర్డ్ అటెన్బరో 1982లో తీసిన గాంధీ సినిమా కంటే ముందు మహాత్మా గాంధీ గురించి ప్రపంచానికి తెలియదని ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం కలకలం రేపింది. మహాత్ముని గురించి తెలుసుకోవాలంటే ప్రధాని మాత్రమే సినిమా చూడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మోదీకి కౌంటర్ ఇచ్చారు.
మహాత్మాగాంధీ గొప్పతనం గురించి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రమోట్ చేయలేదని ‘ఏబీపీ న్యూస్’ ఛానెల్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ అన్నారు. మహాత్మా గాంధీ ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి. గత 75 ఏళ్లుగా గాంధీజీ గ్లోబల్ రెప్యుటేషన్ను పదిలపరిచే బాధ్యత దేశానికి లేదా అని ప్రశ్నించారు.
మొదటిసారిగా గాంధీ చిత్రం తీసినప్పుడు (1982) ఆయన ఎవరని ప్రపంచ ఆసక్తిగా చూసింది. మనం చేయాల్సినంత చేయలేదు. ప్రపంచానికి మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా గురించి తెలిసినప్పుడు, వారికి గాంధీ ఏమాత్రం తక్కువ కాదనే విషయం అంగీకరించి తీరాలి. ప్రంపంచమంతా తిరిగి వచ్చిన తర్వాతే నేను ఈమాట చెబుతున్నాను” అని మోదీ అన్నారు.
కాగా, ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ తన హయాంలో గాంధీ వారసత్వాన్ని నాశనం చేశారని అన్నారు.
మహాత్మాగాంధీ వారసత్వాన్ని ఎవరైనా ధ్వంసం చేశారంటే అది మోదీనే. వారణాసి, ఢిల్లీ, అహ్మదాబాద్లోని గాంధీ సంస్థలను ఆయన ప్రభుత్వమే ధ్వంసం చేసింది. ఇది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హాల్మార్క్. మహాత్మాగాంధీ జాతీయతాభావాన్ని వాళ్లు అర్ధం చేసుకోలేదు. వారి ఐడియాలజీ కారణంగానే నాథూరాం గాడ్సే మహాత్మాగాంధీని పొట్టనపెట్టుకోవడానికి దారితీసింది” అని జైరాం రమేష్ అన్నారు.
మహాత్మాగాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ…
ప్రపంచం మొత్తానికి చీకటితో పోరాడే శక్తిని అందించిన సూర్యుడు మహాత్మా గాంధీ.
బాపు సత్యం, అహింస రూపంలో ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించారు, ఇది బలహీనమైన వ్యక్తికి కూడా అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని ఇస్తుంది.
“సంఘీయులు గాడ్సేను మాత్రమే అర్థం చేసుకుంటారు. గాంధీజీ ప్రపంచం మొత్తానికి స్ఫూర్తి, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అందరూ గాంధీజీ నుండి స్ఫూర్తి పొందారు. భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు గాంధీ మార్గాన్ని అనుసరిస్తారు. అసత్యం,హింసను అనుసరించే వారు గాంధీ మార్గాన్ని అర్థం చేసుకోలేరు” అని రాహుల్ గాంధీ తన వీడియోలో చెప్పారు.