న్యూఢిల్లీ: యుద్ధంలో దెబ్బతిన్న గాజాలోని దక్షిణ నగరమైన రఫాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, క్రీడాకారులు, మిలియన్ల మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆల్ ఐస్ ఆన్ రఫా (అందరి దృష్టి రఫా పైన) అని పాలస్తీనా శిబిరాలపై రాసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా షేర్ చేసి పాలస్తీనా పౌరులకు మద్దతుగా నిలిచారు.
హమాస్పై యుద్దం నెపంతో రఫాలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో చిన్నారులతో సహా కనీసం 45 మంది పౌరులు మరణించారు. ఈ సంఘటన అంతర్జాతీయ ఆగ్రహానికి కారణమైంది. గాజాపై యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ ప్రపంచ వ్యాప్తంగా ఒంటరిదయిపోయింది.
అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి వ్యక్తమైన ఆగ్రహం, వ్యతిరేకతపై తాజాగా ఇజ్రాయెల్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది. “మేము అక్టోబర్ 7 న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటంట్లు చేసిన మెరుపు దాడులపై మాట్లాడటం మానుకోము, అదేవిధంగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలను విడిపించుకునే వరకు మా పోరాటం ఆపము ” అని ‘వేర్ వర్ యువర్ ఐస్’ని చిన్నపిల్లాడి ముందు హమాస్ మిలిటెంట్ తుపాకి పట్టుకొని ఉన్న ఫొటోను షేర్ చేసి కౌంటర్ ఇచ్చింది.
హమాస్ను నాశనం చేయడానికి ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతీకార సైనిక దాడిలొ కనీసం 31,112 మంది మరణించారని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో ఇజ్రాయెల్ కూడా రఫా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని ఖండించింది. హమాస్ ఆయుధ సామాగ్రికి రాకెట్ తాకడం వల్ల సంభవించిన అగ్నిప్రమాదం వల్ల నష్టం జరిగిందని ఇజ్రాయెల్ పేర్కొంది.
X పోస్ట్లో, బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం “అక్టోబర్ 7న మీ కళ్ళు ఎక్కడ ఉన్నాయి” అనే టెక్స్ట్తో కూడిన చిత్రాన్ని షేర్ చేసింది. ఈ చిత్రంలో హమాస్ మిలిటెంట్ శిశువు ముందు నిలబడి ఉన్నట్లు చిత్రీకరించారు.
దాదాపు 45 మిలియన్ల మంది వినియోగదారులు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ వైరల్ అయిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ కౌంటర్ ఇచ్చింది.
“ఆల్ ఐస్ ఆన్ రఫా” చిత్రాన్ని పోస్ట్ చేసిన భారతీయ ప్రముఖుల్లో కొందరు ప్రియాంక చోప్రా జోనాస్, అలియా భట్, కరీనా కపూర్ ఖాన్, మాధురీ దీక్షిత్ నేనే, వరుణ్ ధావన్, సమంతా రూత్ ప్రభు ఉన్నారు.