బెంగళూరు: పలువురు మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ – జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పోలీసులు అరెస్టు చేశారు.
మే 31న తాను విచారణకు హాజరవుతానని మూడు రోజుల కిందట ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు మూడుసార్లు రిటర్న్ టిక్కెట్లు బుక్ చేసి.. చివరి నిమిషంలో రద్దుచేసుకోవడంతో గురువారం కూడా రాడేమోనని పోలీసులు అనుమానించారు. అయితే, ప్రజ్వల్ చెప్పినట్టుగానే మే 30న అర్థరాత్రి బెంగళూరు చేరుకున్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ మ్యూనిచ్ నుంచి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమానంలో వెళ్లినట్లు ఇంటర్పోల్ గురువారం సాయంత్రం తెలియజేసినట్లు సిట్ వర్గాలు పేర్కొన్నాయి. సిట్ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ ఈ నెల ప్రారంభంలో ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. అప్పటి నుంచి భారత్కు తిరిగి రావాలని ఒత్తిడి పెరిగింది.
ప్రజ్వల్ రేవణ్ణ శుక్రవారం తెల్లవారుజామున 12.49 గంటలకు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమానంలో బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. ఇంటర్పోల్ ద్వారా కర్ణాటక పోలీసు అధికారులకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. జర్మనీలోని మ్యూనిచ్ నగరం నుంచి స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12.05 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.35 గంటలకు) లుఫ్తాన్సా విమానం బయలుదేరింది. ఈ విధంగా దాదాపు 10 గంటలపాటు ప్రయాణించిన తర్వాత విమానం భారత్కు చేరుకుంది. తనిఖీలు ముగించుకుని బయటకు రాగానే రేవణ్ణను అరెస్ట్ చేశారు.
మరోవైపు, బెంగళూరులోని ప్రజాప్రతినిధులు ప్రత్యేక న్యాయస్థానంలో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక దౌర్జన్యాల ఆరోపణల కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.