హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఓటర్ల జాబితా తయారీపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రేవంత్రెడ్డి బీసీ కమిషన్ కొత్త ఓటర్ల జాబితాపై నివేదిక ఇవ్వాలని కోరారు.
ఆ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నిన్న స్థానిక సంస్థల ఎన్నికలపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్తో కలిసి సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి అడ్డంకులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితా రావాల్సి ఉందని అధికారులు వెల్లడించగా… ఇంకా ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు ఈసీఐ జాబితాలు అందాయని, త్వరలోనే తెలంగాణతో పాటు మరో ఆరు రాష్ట్రాలకు రానున్నట్లు అధికారులు వివరించారు.
జాబితా వచ్చిన వారం రోజుల్లోనే ఆయా స్థానిక సంస్థలకు అనుగుణంగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను బీసీ కమిషన్ గడువులోగా సమర్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, బీసీ కమిషన్ పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎస్ శాంతికుమార్, సీఎం కార్యదర్శి శేషాద్రి, ఏజీ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.