హైదరాబాద్: తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో కొత్త రేషన్కార్డులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై సబ్ కమిటీ సమావేశం
ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్న సబ్ కమిటీ తొలి సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ విధివిధానాలపై చర్చించింది. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్.చౌహాన్, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్.చొంగ్తు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సబ్కమిటీ సమగ్రమైన, సమ్మిళిత విధానాన్ని నిర్ధారించడానికి వివిధ అంశాలను పరిశీలించింది. లబ్ధిదారులకు భూమి విషయంతో పాటు ఆదాయం విషయంలో నిబంధనలు పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి వార్షిక ఆదాయం లక్షన్నరగానూ, మాగాణి మూడున్నర ఎకరాలు, చెలక ఏడున్నర ఎకరాలుగా ఉండాలని సబ్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. ఇక పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నవారి వార్షిక ఆదాయం 2 లక్షలు ఉన్నవారికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు.
అర్హత ప్రమాణాలపై తమ ఇన్పుట్ కోరేందుకు పార్లమెంటు, శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు పంపుతామని ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. ఈ లేఖలను తక్షణమే రూపొందించి పంపించే బాధ్యతను పౌరసరఫరాల శాఖకు అప్పగించారు.
అంతేకాకుండా, డాక్టర్ ఎన్.సి.సక్సేనా నేతృత్వంలోని సక్సేనా కమిటీ సిఫార్సులను ఉపసంఘం పరిశీలిస్తుంది, ఇందులో సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష్ మందర్ సభ్యునిగా ఉన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు 281.70 లక్షల యూనిట్లు ఉన్నాయి. వీటిలో 35.51 లక్షలు రాష్ట్రం జారీ చేసిన కార్డులు కాగా, మిగిలిన 54.45 లక్షలు జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింది జారిచేసిన కార్డులు.
అర్హత ఉన్న కుటుంబాలన్నీ ఆహార భద్రత పథకాల పరిధిలోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అర్హత ప్రమాణాలను మెరుగుపరచాలని యోచిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.