టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు కలకలం రేపాయి. జపాన్ పశ్చిమ ప్రాంతమైన నర పట్టణంలో ఈ రోజు ఉదయం దుర్ఘటన జరిగింది. ఈ మేరకు జపాన్కు చెందిన ఎన్హెచ్కే వరల్డ్ న్యూస్ వెల్లడించింది. పార్లమెంట్ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో షింజో అబే ప్రసంగిస్తున్నారు. ఇదే సమయంలో వెనుకనుంచి వచ్చిన ఓ దుండగుడు అబేపై దాడి చేసినట్లు పేర్కొంది. దీంతో ఆయన ఒక్కసారిగా ఛాతీపై చేయి పెట్టుకొని కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఎలాంటి కదలికలు లేని ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో ‘అబే’ శ్వాస తీసుకోవడం లేదని, గుండె కూడా చలనం లేదని తెలిసింది. ప్రస్తుతం ఆయన కార్డియో పల్మనరీ అరెస్టు పరిస్థితిలో ఉన్నారని టోక్యో మాజీ గవర్నర్ వెల్లడించారు. జపాన్లో అధికారికంగా మరణాన్ని ధ్రువీకరించడానికి ముందు ఈ పదాన్ని తరచూ ఉపయోగిస్తుంటారు.
అబేకు రక్తస్రావం అయినట్లు చెప్పారు ఎన్హెచ్కే రిపోర్టర్. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సభలో ఉన్న ప్రజలు కూడా ఏదో గన్ షాట్ సౌండ్ వినిపించినట్లు చెప్పుకొచ్చారు. షాట్గన్తోనే దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు కూడా భావిస్తున్నాయి. హత్యాయత్నం చేసినట్లుగా అనుమానిస్తున్న 41 ఏళ్ల యమగామి టెట్సుయాను ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. జపాన్లో గన్ వినియోగంపై కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయినా.. ఒక మాజీ ప్రధానిపై ఇలా జరగడం చర్చనీయాంశమైంది.
#BREAKING | Ex Japan PM Shot, Shows "No Vital Signs" After Attack: Reports https://t.co/1JvrxgyUaO
NDTV's Maha Siddiqui reports pic.twitter.com/ttub8hFlVd
— NDTV (@ndtv) July 8, 2022