గువహటి: అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద కారణంగా వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వర్షాలు, వరదలకు ఇప్పటివరకు 192 మంది మృతి చెందారు.
ఈ మేరకు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) బులెటిన్ ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. హైలాకండి జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారని తెలిపింది. అలాగే.. 12 జిల్లాల్లో 5.40 లక్షల మంది వరదల వల్ల ప్రభావితం అయ్యారని, 18 రెవెన్యూ డివిజన్లలోని 390 గ్రామాలు నీట మునిగాయని తెలిపింది.
కచార్ జిల్లా వదర వల్ల అత్యంత ప్రభావితమైంది. ఈ జిల్లాలో ఇప్పటివరకూ 3,55,960 మంది వరదల వల్ల ప్రభావితం అయ్యారు, ఆ తరువాత.. మోరిగావ్ లో 1,42,662 మంది వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని 114 సహాయ శిబిరాల్లో 38,000 మంది ప్రజలు తలదాచుకున్నారు. మొత్తం 7,368.41 హెక్టార్ల పంట నీట మునిగిందని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది.
గత 24 గంటల్లో దిబ్రూఘర్, మోరిగావ్, నాగావ్, ఉదల్గురి, బక్సా, హోజాయ్ జిల్లాల్లో ఇళ్లు, రోడ్లు, ఇతర భవనాలు దెబ్బతిన్నాయి. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం, బక్సా, విశ్వనాథ్, బొంగైగావ్, మోరిగావ్, టిన్సుకియా జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పెద్ద నది కూడా ప్రమాద స్థాయికి మించి ప్రవహించడం లేదు.