నూఢిల్లీ: బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ కింద విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈమెతో పాటు సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, మరో పిటిషనర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ ముగ్గురి తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, న్యాయవాది అపర్ణా భట్లు పిటిషన్లు దాఖలు చేయగా.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
కాగా, తాము రిమిషన్ను మాత్రమే సవాల్ చేస్తున్నామని, సుప్రీంకోర్టు ఆర్డర్ను కాదని పిటిషనర్లు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. రిమిషన్ మంజూరు చేసిన విధానాలు సరిగా లేవని పేర్కొన్నారు. దోషుల విడుదలను మంజూరు చేసే ఉత్తర్వు(ల)ను రద్దు చేయాలని పిటిషన్ కోరింది. ఇప్పటికే ఉన్న చట్టబద్ధమైన ఫ్రేమ్వర్క్ను పరిశీలించిన తర్వాత అవసరమైతే ఉపశమనాన్ని మంజూరు చేయడంలో విచక్షణను ఉపయోగించేందుకు మరియు అటువంటి విచక్షణను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఉపశమన మంజూరు కోసం మార్గదర్శకాలను రూపొందించాలని కూడా పిటిషన్ కోరింది. ఈ పిటిషన్ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
కాగా, క్రూరమైన అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన 11 మంది దోషుల్లో ఒకరైన రాధేశ్యామ్ షా తనను ముందస్తుగా విడుదల చేసేందుకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇతని అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అతని శిక్షను తగ్గించే అంశాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. గుజరాత్ ప్రభుత్వం మొత్తం 11 మంది నిందితులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం నిందితులంతా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, జైలు నుంచి విడుదలైన సందర్భంగా వీరందరికీ పూలమాలలు వేసి, స్వీట్లు తినిపించి సత్కరించారు కొందరు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.
నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నాశనం చేసిన 11 మంది దోషులు ఆగస్టు 15 న విడుదలయ్యారన్న వార్త విని… 20 సంవత్సరాల గాయం మళ్లీ తిరగబెట్టిందని బిల్కిస్ బానో రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు.