జెరూసలెం: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు పాలస్తీనా యువకులను ఇజ్రాయెల్ దళాలు కాల్చి చంపాయని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని కల్కిలియా నగరంలో శుక్రవారం 14 ఏళ్ల ఓ యువకుడుని, కాల్చి చంపారు. రమల్లా సమీపంలోని అల్ మజ్రా అల్ గర్బియా గ్రామంలో మరొకరని చంపేశారని మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాదు ఈ ఘటనలో 12 మందికిపైగా గాయపడ్డారు.
ఇజ్రాయెల్ మిలిటరీ కథనం ప్రకారం… కల్కిలియా సమీపంలో ఇజ్రాయిల్ దళాలు సాధారణ గస్తీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నపుడు ఓ అనుమానితుడు మోలోటోవ్ కాక్టెయిల్ను వారిపై విసిరాడు, దీంతో తమ సైన్యం ప్రత్యక్ష కాల్పులతో ప్రతిస్పందించాయని వారు తెలిపారు.
అల్-ఘర్బియాలో అక్రమ ఇజ్రాయెల్ స్థిరనివాసులతో ఘర్షణల సమయంలో నివాసితులపై ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపారని, 17 ఏళ్ల పాలస్తీనియన్ మరణించారని, మరొకరు గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రమల్లాకు వాయువ్య ప్రాంతంలో టియర్ గ్యాస్, రబ్బరు పూతతో కూడిన బుల్లెట్లు దెబ్బకు గాయపడిన 50 మందికి తమ వైద్యులు చికిత్స చేశారని పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. ఇజ్రాయెల్ భూభాగాన్ని ఆక్రమించడాన్ని నిరసిస్తూ పాలస్తీనియన్లు ప్రతి శుక్రవారం వెస్ట్ బ్యాంక్లోని కొన్ని ప్రాంతాల్లో సమావేశమవుతారు.
‘ఉరిశిక్షలు’
ఈ మరణాలను పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ “ఉరిశిక్షలు”గా అభివర్ణించింది. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రతినిధి నబిల్ అబు రుదీనెహ్ మాట్లాడుతూ… ఇజ్రాయిల్ దళాల “ఈ నేరాలు మా ప్రజలపై ఉల్లంఘనలు, క్షేత్రస్థాయి ఉరిశిక్షల శ్రేణిలో భాగంగా ఉన్నాయి” అని ఒక ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయెల్ “ఈ ప్రాంతాన్ని హింసాత్మకంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ వాఫా ఒక ప్రకటనలో ఆరోపించింది. నవంబర్ 1 న సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ ఇటీవలి కాలంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో తన దాడులను తీవ్రతరం చేసింది, ఇప్పటివరకు ఇజ్రాయిల్ సైనికుల వివిధ నగరాల్లో జరిపిన దాడుల్లో 19 మంది మరణించారు.
జనవరి నుండి ఇప్పటిదాకా ఇజ్రాయిల్ దళాల దురాగతానికి పాలస్తీనా ఫైటర్స్, పౌరులతో సహా మొత్తం 90 మందికి పైగా పాలస్తీనియన్లు బలయ్యారు. వీరిలో 20 మంది చిన్నారులు ఉన్నారని ఐరాస తెలిపింది. ఇజ్రాయెల్ 1967 మధ్యప్రాచ్య యుద్ధంలో వెస్ట్ బ్యాంక్ను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి ఆ ప్రాంతంలో దాదాపు 5లక్షలమంది ఇజ్రాయిలీలను అక్రమంగా స్థిరనివాసం ఉంచింది. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు 2014లో నిలిచిపోయాయి, ఇజ్రాయెల్ అనేక పాలస్తీనా ప్రాంతాలలో అక్రమ నివాసాలను విస్తరించింది.