హైదరాబాద్: రాజధాని నగరంలో పాదచారుల రక్షణ కోసం… నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వం ఆకాశ వంతెనలు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఉప్పల్ జంక్షన్ వద్ద స్కైవాక్ 2023 జనవరి నాటికి సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్లో పాదచారుల భద్రతకు శాశ్వత భరోసా కల్పిస్తూ అంతర్జాతీయ హంగులతో, రూ.25 కోట్ల అంచనా వ్యయంతో హెచ్ఎండీఏ చేపట్టిన అకాశమార్గాన్ని (స్కైవాక్) పనులు తుది దశకు చేరుకున్నాయి.
రామంతాపూర్-బోడుప్పల్ రోడ్కు, హబ్సిగూడ-ఎల్బీనగర్ వైపు మార్గాలను అనుసంధానం చేస్తూ పాదచారులు అన్ని వైపులా వెళ్లేందుకు వీలుగా ఈ జంక్షన్ చుట్టూ సర్కిల్ ఆకారంలో స్కై వాక్ రానున్నది. ఎలివేటెడ్ కారిడార్తో పాటు సూర్యకాంతి, వర్షం బారిన పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఉప్పల్ మెట్రోస్టేషన్కు కనెక్టివిటి ఇవ్వనున్నారు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్కైవాక్ ఈ ఏడాది చివరి నాటికి లేదా జనవరి 2023 మధ్య నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ స్కైవాక్ 640 మీటర్లకు విస్తరించి ఉంది. దీని సాధారణ వెడల్పు 3 మీటర్లు, 4 మీటర్లు, కొన్ని చోట్ల 6 మీటర్ల వరకు ఉబ్బెత్తుగా ఉంటుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ తెలిపింది.
రామంతాపూర్ రహదారులు, మెట్రో స్టేషన్తో ఈ వంతెనను అనుసందానించారు. ఈ నిర్మాణంతో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది. నాలుగు వైపుల నుంచి నేరుగా మెట్రో స్టేషన్కు చేరుకునేలా దారులు ఏర్పాటు చేశారు. ఎక్కడా రోడ్డును దాటే అవసరం లేకుండా స్కైవాక్ నుంచి అటు నుంచి ఇటువైపు.. ఇటు నుంచి అటు వైపు ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. మెట్లు ఎక్కలేని వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు, గర్భిణులు స్కైవాక్ను చేరుకోవడానికి ఎస్కలేటర్లు, లిఫ్టులు సౌకర్యం కల్పించనున్నారు. ఈ నడక వంతెనతో జంక్షన్లో ప్రయాణికుల రద్దీ తగ్గి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి.
- స్కైవాక్ పొడవు 840 మీటర్లు
- వెడల్పు 34 మీటర్లు, కొన్నిచోట్ల 6 మీటర్లు
- లిఫ్టులు 6 మెట్ల మార్గాలు 12
- ఎస్కలేటర్లు 4
- ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు: రామంతాపూర్ రోడ్డు, నాగోలు రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్కు, వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో ఆఫీస్, ఉప్పల్ సబ్ స్టేషన్.
స్కైవాక్ సిద్ధం అయ్యాక, ఉప్పల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు పాదచారుల భద్రత మెరుగవుతుంది. అత్యాధునిక లైంటింగ్, వీధి దీపాలు తదితర అలంకరణల నడుమ ఈ అకాశమార్గాన్ని ఈ ఏడాది చివరి నాటికి లేదంటే కొత్త ఏడాది జనవరిలో అందుబాటులోకి రానున్నది.