హైదరాబాద్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలు… చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ (CwSN) చదువుకునేలా ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా 6 నుండి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు మినహాయింపులు, రాయితీలను ప్రకటించింది. అంతేకాదు ఈ విద్యా సంవత్సరం. SSC పబ్లిక్ పరీక్షలలో అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత మార్కులను 35 నుండి 20కి తగ్గించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ GO MS 27ని జారీ చేసింది. దీని ప్రకారం మేధోపరమైన సవాళ్లు (ఆటిజం, మానసిక అనారోగ్యం) ఉన్న విద్యార్థులకు ఉత్తీర్ణత మార్కులు పది మార్కులు పొందితే ఉత్తీర్ణులైనట్లుగానే పరిగణిస్తారు.
తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో అంధులు, చెవిటి, మూగ విద్యార్థులతోపాటు సెరిబ్రల్ పాల్సీ, తలసేమియా తదితర 21 విభాగాల్లోని ప్రత్యేక అవసరాల పిల్లలకు ఊరట కలిగినట్లయింది. రాష్ట్రంలో 6-10 తరగతుల్లో ప్రత్యేక అవసరాల పిల్లలు 22,315 మంది ఉన్నట్లు తాజా యూడైస్ నివేదిక వెల్లడించింది. వారికి పరీక్ష రాసే సమయం కూడా పెంచారు. సాధారణ విద్యార్ధులకు పరీక్ష సమయం 3 గంటలు మాత్రమే. పిల్లలకు గంటకు 20 నిమిషాల చొప్పున 60 నిమిషాలు అదనంగా (మొత్తం 4 గంటలు) సమయం కేటాయిస్తారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులే వారి జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు.
మరికొన్ని మినహాయింపులు:
- పరీక్ష కేంద్రంలోకి క్యాలిక్యులేటర్లకు అనుమతి. ‘ ప్రత్యేక జవాబు పత్రాల అందజేత.
- మూడు భాషా సబ్జెక్టుల్లో ఒక దానికి మినహాయింపు. అంటే తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో ఏదైనా ఒక దాన్ని చదవకుండా, పరీక్ష రాయకుండా మినహాయింపు.
- పరీక్ష రుసుం ఉండదు.
- తరగతులకు 50 శాతం హాజరు ఉంటే పరీక్షలు రాయవచ్చు.
- కేటగిరీల వారీగా మరికొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు.
చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ (CwSN) విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సులువుగా చేరుకునేందుకు వీలుగా పరీక్ష సమయంలో జంబ్లింగ్ ప్రక్రియను తొలగించాలని, సాధ్యాసాధ్యాల మేరకు వారిని అదే పాఠశాల లేదా సమీపంలోని పాఠశాలలను పరీక్షా కేంద్రంగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్దిష్ట అవసరాలను బట్టి, ఈ మినహాయింపు, రాయితీలు ఈ విద్యా సంవత్సరం 2022-23 నుండి పొడిగించే అవకాశముంది.