హైదరాబాద్: యూనివర్సిటీ మెస్ల వద్ద అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని గుర్తించేందుకు, హాజరు నమోదు చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) నిర్ణయించింది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ (FRS)తో కూడిన CCTV కెమెరాలను మెస్ల వద్ద ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) సాంకేతికత ఆధారంగా, మెస్లో బోజనం చేస్తున్న విద్యార్థుల ఫొటోలను స్వీకరించి, వాటిని అందుబాటులో ఉన్న డేటాబేస్తో పేరు, రోల్ నంబర్, మెస్ నంబర్ వంటి వివరాలను సరిచూడనున్నాయి.
ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ ఏర్పాటుతో విశ్వవిద్యాలయానికి రెండు ప్రయోజనాలు సమకూరుతాయి. ఒకటి హాజరు నమోదు, మెస్ సౌకర్యాలను పొందుతున్న వారిని పర్యవేక్షించడం. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు తప్పుడు క్లెయిమ్లు చేస్తే సులభంగా గుర్తించేందుకు ఈ సాంకేతికత సహాయపడుతుంది. ప్రస్తుతం మెస్ రిజిష్టర్లలో నమోదనైన నంబర్లకు, విద్యార్థుల మెస్ నంబర్ల తేడాలున్నాయని అధికారులు గుర్తించారు. “యూనివర్శిటీలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం కళాశాలలు, వివిధ భవనాలతో సహా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 808 CCTV కెమెరాలు ఉన్నాయి. మరో 215 కెమెరాలను మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మొబైల్ అప్లికేషన్ ద్వారా జియో-హాజరు అమలు చేయడానికి యూనివర్సిటీ ప్రణాళికలను రూపొందించింది.
మొత్తం తరగతిని ఒకేసారి స్కాన్ చేసి, విద్యార్థుల చిత్రాలను క్యాప్చర్ చేసే మొబైల్ అప్లికేషన్ కోసం విశ్వవిద్యాలయ పాలకమండలి ఒక కంపెనీతో చర్చలు జరుపుతోంది. ఈ చిత్రాలు డేటాబేస్లో అందుబాటులో ఉన్న ఫోటో, పేరు, రోల్ నంబర్తో సహా వివరాలతో సరిచూసి హాజరు నమోదు చేస్తుంది.
“బయోమెట్రిక్ యంత్రాల ద్వారా ప్రతి విద్యార్థి తమ హాజరును నమోదు చేయడానికి కనీసం 10 సెకన్లు పడుతుంది. ఒకే స్కాన్తో, ఈ మొబైల్ యాప్ కేవలం 90 సెకన్లలో మొత్తం తరగతి హాజరును క్యాప్చర్ చేస్తుంది. ప్రయోగాత్మకంగా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ కొత్త కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలంగాణ టుడేకి తెలిపారు.