28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

కొత్త ఏడాదిలో ‘సికింద్రాబాద్‌-విజయవాడ’ మధ్య వందే భారత్ రైలు!

హైదరాబాద్: సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలోనే తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టబోతోంది. అత్యాధునిక హంగులతో విమాన తరహా అనుభూతిని కలిగించే వందే భారత్.. కొత్త ఏడాదిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడకు రాకపోకలు సాగించనుంది.

సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో వందేభారత్ రైలుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు ఆసక్తిగా ఉన్నారు.

దేశీయ రైలు ప్రయాణాలకు ఆధునిక హంగులు తెచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను దశలవారీగా అన్ని జోన్లలో ప్రవేశపెడుతున్నారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయోనని ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చెన్నై-మైసూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది.

దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఐదు వందే భారత్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. దక్షిణ మధ‌్య రైల్వే పరిధిలో ప్రారంభమయ్యే సర్వీసుతో ఆరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కనుంది. గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యమున్న వందే భారత్ రైలు రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే 160కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

వందే భారత్‌లో మొత్తం 1,128 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం ఉంది, అన్ని కోచ్‌లు ఆటోమేటిక్ డోర్‌లతో ఉంటాయి. GPS-ఆధారిత ఆడియో-విజువల్ ప్రయాణీకుల సమాచార వ్యవస్థ, వినోద ప్రయోజనాల కోసం ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్ Wi-Fi,  సౌకర్యవంతమైన సీటింగ్ ఇందులో ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వంద భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని కిషన్‌రెడ్డి రైల్వే మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. అయితే, రోలింగ్ స్టాక్ డిమాండ్‌ను తీర్చడంలో పరిమితుల కారణంగా దీనికి సమయం పట్టే అవకాశం ఉంది.

అయితే ఫిబ్రవరిలో వందేభారత్ రైలును విశాఖపట్నం వరకు పొడిగించే యోచనలో ఉన్నారు. విజయవాడ-విశాఖపట్నం మధ్య రైలు నడపడానికి గల సాధ్యాసాధ్యాలపై త్వరలో అధ్యయనం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

చెన్నైలోని పెరంబూర్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) మేక్ ఇన్ ఇండియా చొరవ కింద వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రూపొందిస్తోంది మరియు తయారు చేస్తోంది. ఆగస్టు 15, 2023 నాటికి 75 వందేభారత్ రైళ్లను నడపాలని రైల్వే యోచిస్తోంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles