అమరావతి: స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరిగే.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్ బయల్దేరి వెళ్లారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దావోస్ పయనమయ్యారు. సీఎం జగన్ తోపాటు ఆయన సతీమణి భారతి, కుమార్తె వైఎస్.వర్షారెడ్డి, ఓఎస్డీలు పి.కృష్ణ మోహన్ రెడ్డి, ఏ.జోషి ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 31న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. సీఎం జగన్ కు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సీఎస్. సమీర్ శర్మ, కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఇతర ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు.
కరోనా మహమ్మారి ప్రభావంతో రెండేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సంఘం సదస్సు.. ఈ నెల 22 నుంచి 26వరకూ జరగనుంది. రాష్ట్రం నుంచి సీఎం జగన్ తోపాటు, మంత్రులు, అధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్ వేదికగా సీఎం కీలక చర్చలు జరపనున్నారు. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన మూడు ఎయిర్ పోర్టులు ఎలా దోహద పడతాయో వివరిస్తారు. అదే సమయంలో బెంగళూరు-హైదరాబాద్, చెన్నై-బెంగళూరు, విశాఖపట్నం-చెన్నై కారిడార్లలో పెట్టుబడి అవకాశాల్ని వివిధ పారిశ్రామిక సంస్థల ముందుంచనున్నారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సదస్సు ద్వారా ప్రస్తావించనున్నారు. కొవిడ్ నియంత్రణలో రాష్ట్రం అనుసరించిన ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ అంశాల్నివివరించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాల్ని వివరించేందుకు దావోస్లో ప్రత్యేకంగా ఏపీ పెవిలియన్ ఏర్పాటుచేశారు.
దావోస్ పర్యటనలో సీఎం జగన్ ప్రధానంగా 3 కీలక సమావేశాలలో భాగస్వామ్యం కానున్నారు. 23న తేదీన వైద్యరంగంపై కీలక సమావేశం నిర్వహిస్తారు. 24వ తేదీన విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. 24వ తేదీన డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా మార్పుపై సమావేశంలో పాల్గొంటారు. “ప్రజలు , పురోగతి , అవకాశాలు” అనే నేపథ్యంతో ప్రపంచ వేదికగా ఏపీలో ఉన్న అపార అవకాశాలను చాటేందుకు దావోస్ పర్యనకు వెళ్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవలే సీఎం జగన్ దావోస్ వెళ్లేందుకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. దీంతో జగన్ టూర్ కు లైన్ క్లియర్ అయింది. సీఎం అయన మూడేళ్ల తర్వాత తొలిసారి పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎలాంటి సంస్థలను తీసుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది.