టెల్అవీవ్: కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించేందుకు ఇజ్రాయెల్-హమాస్ నేతలు సిద్ధమవుతున్న తరుణంలో, సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన వైమానిక దాడులను చేపట్టింది. ఈ దాడుల్లో పిల్లలతో సహా 30 మంది పాలస్తీనియన్లు మరణించారు. 100మందికిపైగా గాయపడ్డారు. కాలిన గాయాలు, తెగిపడ్డ అవయవాలతో ఆసుపత్రి ప్రాంగణమంతా బీభత్సంగా ఉంది.
గత నాలుగు రోజుల్లో లక్షా 86వేల మంది పాలస్తీనీయులను ఇజ్రాయిల్ సైన్యం ఖాళీ చేయించింది. ఇంతలోనే వైమానిక బాంబు దాడులకు దిగడంతో ఖాన్ యూనిస్లో అనేక మంది చిక్కుకుపోయారని ఐరాస మానవతా సహాయక సంస్థ ప్రత్యేక దూత ఆందోళన వ్యక్తం చేశారు.
అంతకుముందు శనివారం, పాలస్తీనా అధికారిక మీడియా, దక్షిణ నగరం ఖాన్ యూనిస్లో తెల్లవారుజాము నుండి ఇజ్రాయెల్ దాడుల వల్ల కనీసం 14 మంది పాలస్తీనియన్లు మరణించారని, వారి మృతదేహాలను నాసర్ మెడికల్ కాంప్లెక్స్కు తీసుకువచ్చారని చెప్పారు.
ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనియన్లకు ఖాన్ యూనిస్ దక్షిణ పొరుగు ప్రాంతాలను తాత్కాలికంగా ఖాళీ చేసి, అల్-మవాసిలోని మానవతా ప్రాంతానికి మకాం మార్చమని చెప్పిందని సైనిక ప్రకటన తెలిపింది.
పౌరులకు ప్రమాదాన్ని తగ్గించడానికి అనేక మాధ్యమాల ద్వారా ప్రజలను ఖాళీ చేయమని పిలుపునిచ్చామని సైన్యం తెలిపింది.
అల్-బురీజ్ శరణార్థి శిబిరంలో, ఒక ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఐదుగురు పాలస్తీనియన్లు మరణించగా, ఈజిప్టు సరిహద్దుకు సమీపంలోని రఫాలో ఒక ఇంటిపై జరిగిన మరో దాడిలో మరో నలుగురు మరణించారని వైద్యులు తెలిపారు.
ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో శక్తివంతమైన బాంబులను ఉపయోగిస్తోందని, పౌరులకు సురక్షితమైన ప్రదేశాలే లేకుండా పోయాయని యు.ఎన్, మానవతా అధికారులు ఆరోపిస్తున్నారు.
కాగా, శుక్రవారం సైనిక దళాలు ఖాన్ యూనిస్లో పాలస్తీనా యోధులతో పోరాడి, సొరంగాలు, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
హమాస్ నేతృత్వంలోని అక్టోబర్ 7 దాడి తరువాత గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర ప్రారంభించిన తొమ్మిది నెలలకు పైగా పాలస్తీనాపై తన దమనకాండను కొనసాగిస్తోంది.
గాజా ఆరోగ్య అధికారుల ప్రకారం… ఎన్క్లేవ్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల 39,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.
ఇజ్రాయెల్ అధికారులు అంచనా ప్రకారం దాదాపు 14,000 మంది హమాస్ యోధులను చంపేశారు. మరికొంతమంది ఖైదీలుగా ఉన్నారు. యుద్ధం ప్రారంభంలో వారి సంఖ్య 25,000 కంటే ఎక్కువగా ఉంటుందని ఇజ్రాయెల్ అంచనా వేసింది.