వాషింగ్టన్: వచ్చే వారం తన సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా “వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని” లక్ష్యంగా పెట్టుకున్నట్లు యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ చెప్పారు. అయితే తాను “ప్రాథమిక అమెరికన్ విలువలకు” కట్టుబడి ఉంటానని అన్నారు.
“సౌదీ అరేబియాకు వెళ్లాలనే నా నిర్ణయంతో విభేదించే వారు చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. మానవ హక్కులపై నా అభిప్రాయాలు స్పష్టంగానే ఉన్నాయి. నేను విదేశాలకు వెళ్లినప్పుడు ప్రాథమిక స్వేచ్ఛ ఎల్లప్పుడూ ఎజెండాలో ఉంటుంది” అని బిడెన్ శనివారం ప్రచురించిన వాషింగ్టన్ పోస్ట్ ఒపీనియన్ పీస్లో రాశారు.
బిడెన్ తన పర్యటన సందర్భంగా అమెరికాలో ఇంధన ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకునేందుకు సౌదీ చమురు ఉత్పత్తిని పెంచాలని ఒత్తిడి చేయవచ్చని భావిస్తున్నారు. తుర్కియాలోని సౌదీ కాన్సులేట్లో జమాల్ ఖషోగ్గి సంఘటన తర్వాత సంబంధాలను చక్కదిద్దే దిశగా ఈ పర్యటన ఉపకరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని అమెరికా సంచలన ప్రకటన చేసింది. సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య జరిగినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను సౌదీ అరేబియా ఖండించింది. అయితే బిడెన్ మాత్రం ఇది “నా పర్యవేక్షణలో జరిగింది” కాబట్టి తాను బాధ్యత వహిస్తానని చెప్పాడు.
కింగ్ సల్మాన్ను కలుస్తా… బైడెన్!
గత నెలలో బిడెన్ స్వయంగా రాబోయే విమర్శల నుండి దూరంగా ఉండాలని కోరుకున్నారు, సౌదీ పర్యటనలో కింగ్ సల్మాన్, అతని బృందాన్ని కలవబోతున్నట్లు విలేకరులతో స్పష్టంగా చెప్పారు. వైట్ హౌస్ కూడా ఈ వార్తను ధృవీకరించింది. “అధ్యక్షుడిగా, మన దేశాన్ని బలంగా, సురక్షితంగా ఉంచడం నా పని” అని అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్ పోస్ట్లో శనివారం రాశారు.
“ఈ పనులు చేయడానికి, మేము ఆ ఫలితాలను ప్రభావితం చేయగల దేశాలతో నేరుగా నిమగ్నమవ్వాలి. సౌదీ అరేబియా వాటిలో ఒకటి అని బిడెన్ తెలిపారు. తన పర్యటన సందర్భంగా సౌదీ నాయకులతో సమావేశమైనప్పుడు… నా లక్ష్యం ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమేనని అమెరికా అధ్యక్షుడు అన్నారు. అయితే ప్రాథమిక అమెరికన్ విలువలకు కూడా కట్టుబడి ఉంటానని అగ్రరాజ్యాధిపతి అన్నారు.