నెల్లూరు : శ్రీహరికోట – షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ ఉదయం 9 గంటలకి ఎల్వీఎం – 3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నిన్న ఉదయం 8.30 గంటల నుంచి నిర్విఘ్నంగా కౌంట్ డౌన్ సాగింది. నేటి ఉదయం 9 గంటలకు ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. LVM3 -M3 రాకెట్ ద్వారా వన్ వెబ్ ఇండియా-2 పేరుతో 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యల్లోకి పంపించారు.
ప్రయోగం తర్వాత 19.7 నిమిషాల్లో మూడు దశలను విజయవంతంగా పూర్తిచేసిన ఎల్వీఎం-3 నౌక నిర్దేశిత కక్ష్యలోకి 36 ఉపగ్రహాలను చేర్చింది. భూమి నుంచి 450 కిలోమీటర్ల దూరంలోకి కక్ష్యలోకి చేరిన తర్వాత.. ఉపగ్రహాలు ఒక్కొక్కటిగా విడిపోవడం ప్రారంభించాయి. ఈ ప్రక్రియ దాదాపు గంటన్నర కొనసాగుతుంది.
ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్వెబ్తో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా మొదటి 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా రెండో విడత 36 ఉపగ్రహాలను పంపింది.
జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ (GSLV MK-3)కి అప్గ్రేడెడ్ వెర్షన్ అయిన లాంచ్ వెహికల్ మార్క్-3 ద్వారా ఈ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఎల్వీఎం-3 ద్వారా ఇస్రో చేపట్టిన రెండో వాణిజ్య ప్రయోగం ఇది. ఎల్ఎంవీ 3 రాకెట్ సుమారు నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలను జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు మోసుకెళ్లగలదు. జియోసింక్రనస్ ఆర్బిట్ భూ మధ్య రేఖకు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది.
ప్రయోగం విజయవంతం కావడంపై తమ శాస్త్రవేత్తలను , ఇస్రోను అభినందిస్తూ OneWeb ట్వీట్ చేసింది.
We have lift off!
Thanks to our colleagues at @isro and @NSIL_India for a successful launch. If you don’t already, make sure to follow us for more updates throughout the rest of the mission.#OneWebLaunch18 🚀 pic.twitter.com/TsYbCZzAnP
— OneWeb (@OneWeb) March 26, 2023