ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలోని మెజా ప్రాంతంలోని ఇంటర్మీడియట్ కాలేజీలో దాదాపు 27 మంది విద్యార్థులు కలుషిత నీటిని తాగి అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే విద్యార్థులను మెజా సిహెచ్సిలో చేర్చారు. వారిలో నలుగురిని అక్కడ నుండి ఎస్ఆర్ఎన్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. కలుషిత నీరు తాగడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రాథమిక నివేదికల ప్రకారం, మెజాలోని గదురాహి పహాడీ వద్ద గల గులాబ్ శంకర్ ఇంటర్మీడియట్ కళాశాలలో 6, 7, 8 తరగతులకు చెందిన కొంతమంది విద్యార్థులు పాఠశాలలో విరామం సమయంలో నీరు తాగారు. వెంటనే ఈ విద్యార్థులు కడుపు నొప్పిగా ఉందని ఫిర్యాదు చేయడం ప్రారంభించారు మరికొందరు అపస్మారక స్థితిలో పడిపోయారు. పాఠశాల అధికారులు వెంటనే అంబులెన్స్ను పిలిపించి 27 మంది విద్యార్థులను సీహెచ్సీ మెజాకు పంపించారు. పిల్లలందరిలో ఒకే రకమైన లక్షణాలు ఉన్నాయని సీహెచ్సీ సూపరింటెండెంట్ ఓం ప్రకాశ్ తెలిపారు. కొందరికి కడుపు, తల, చేతులు, కాళ్లలో నొప్పి వస్తుండగా మరికొందరు వాంతులు చేసుకుంటున్నారు. పరిస్థితి విషమంగా ఉందని నలుగురు విద్యార్థులను వైద్యులు ఎస్ఆర్ఎన్ ఆస్పత్రికి తరలించారు.