ఇంఫాల్: మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలోని మోంగ్బంగ్ గ్రామంలో ఆదివారం ఉదయం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) జవాన్ మరణించారు. ఈ దాడిలో ఒక పోలీసు కూడా గాయపడ్డాడని, అతన్ని ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడు బీహార్కు చెందిన అజయ్ కుమార్ ఝా (43)గా గుర్తించారు. “అతను తలపై బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు. గాయపడిన పోలీసు చికిత్స పొందుతున్నాడు, అయితే అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని” పోలీసు అధికారి తెలిపారు.
ఉగ్రదాడిని మణిపూర్ గవర్నర్ అనుసుయా ఉయికే ఖండించారు.
X లో రాసిన ఒక పోస్ట్లో “హింసాత్మక చర్య”ని ఖండించారు. మరణించిన సైనికుడి ఆత్మ శాంతి కోసం ప్రార్థించారు.
“ అనుమానిత తిరుగుబాటుదారులచే జిరిబామ్ ఆకస్మిక దాడిలో ఒక CRPF సైనికుడిని కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సైనికుడి కుటుంబానికి ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది’ అని రాజ్ భవన్ పోస్ట్లో పేర్కొంది.
” ఈ హేయమైన హింసాకాండను ఆమె తీవ్రంగా ఖండిస్తున్నట్లు, మణిపూర్లో ఇటువంటి చర్యలను సహించబోమని నొక్కి చెప్పారు. న్యాయం, శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్రం కట్టుబడి ఉందని పోస్ట్లో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కూడా దాడిని ఖండించారు, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
“ఈరోజు జిరిబామ్ జిల్లాలో కుకీ మిలిటెంట్లుగా అనుమానిస్తున్న ఒక సాయుధ బృందం జరిపిన దాడిలో ఒక CRPF సిబ్బందిని చంపడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. “విధి నిర్వహణలో ఆయన చేసిన అత్యున్నత త్యాగం వృధా పోదు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూనే, మరణించిన సైనికుడి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని సీఎం అన్నారు.
శనివారం రాత్రి కూడా గ్రామంలో తుపాకీ శబ్దాలు వినిపించాయని అధికారి తెలిపారు. ఆదివారం నాటి దాడి తరువాత మోంగ్బంగ్ వద్ద ప్రక్కనే ఉన్న కొండ ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు మరొక అధికారి తెలిపారు. ఉదయం 9.40 గంటలకు జరిగిన తుపాకీ దాడిలో భద్రతా సిబ్బందికి చెందిన వాహనం ధ్వంసమైందని ఆయన తెలిపారు.
మరోవంక రాష్ట్రంలోని కుకీల అపెక్స్ బాడీ అయిన కుకి ఇన్పి మణిపూర్ (KIM) హింసాత్మక చర్యను ఖండించింది. దీనిని “రాష్ట్ర ప్రాయోజిత దాడి”గా పేర్కొంది.
మణిపూర్లో గత ఏడాది మే నుండి మెయిటీ, కుకీ కమ్యూనిటీల మధ్య జాతి హింస చెలరేగి, 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.