దిల్లీ: దేశ వ్యవసాయ రంగంలో నవ శకానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. పంట పొలాల్లో ఎరువులు చల్లడంతో పాటు ఇతర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను మోసుకెళ్లేలా సరికొత్త ‘కిసాన్ డ్రోన్ల’ను ప్రధాని నేడు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఒకేసారి 100 కిసాన్ డ్రోన్లను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సాగులో డ్రోన్ల వాడకం రైతులకు ‘సరి కొత్త విప్లవానికి నాంది’ అని మోదీ అభివర్ణించారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..
“కొన్నేళ్ల క్రితం వరకు డ్రోన్లు కేవలం రక్షణ రంగానికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు వీటి వినియోగం ఇతర రంగాలకు కూడా విస్తరించింది. దేశంలో ‘డ్రోన్ స్టార్టప్‘ల కొత్త ఒరవడి సిద్ధమవుతోంది. ప్రస్తుతం 200లకు పైగా డ్రోన్ స్టార్టప్ లు ఉండగా.. త్వరలోనే వీటి సంఖ్య వెయ్యి దాటుతుంది. దీని వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెద్ద మొత్తంలో పెరగనున్నాయి.
వ్యయసాయ రంగంలో డ్రోన్ల వినియోగం ఆధునిక వ్యవసాయంలో కొత్త అధ్యాయం” అని మోదీ చెప్పుకొచ్చారు.
దేశీయ యువ టాలెంట్ పట్ల భారత్ ఎప్పుడూ విశ్వాసంగా ఉందని, కొత్త ఆలోచనలతో ముందుకెళ్తోందని మోదీ తెలిపారు. ఇప్పటికే డ్రోన్లను ఔషధాలు, వ్యాక్సిన్ల రవాణాకు ఉపయోగించినట్లు గుర్తుచేశారు. కిసాన్ డ్రోన్లు కొత్త విప్లవానికి ఆరంభమని, త్వరలోనే రైతులు తమ ఉత్పత్తులను తక్కువ సమయంలో మార్కెట్లకు చేరవేసేందుకు అధిక సామర్థ్యం గల డ్రోన్లు వినియోగించుకుంటారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత, మోదీ ట్వీట్ చేస్తూ, “దేశవ్యాప్తంగా 100 ప్రదేశాలలో కిసాన్ డ్రోన్లను అమలు చేయడం ఆనందంగా ఉంది. ఇది ఒక శక్తివంతమైన స్టార్టప్, @garuda_india ద్వారా మంచి ప్రయత్నం. వినూత్న సాంకేతికత మన రైతులకు కొత్త శక్తినిస్తుంది. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మారుస్తుందని ట్వీట్ లో పేర్కొన్నారు.
Glad to have witnessed Kisan Drones in action at 100 places across the country. This is a commendable initiative by a vibrant start-up, @garuda_india.
Innovative technology will empower our farmers and make agriculture more profitable. pic.twitter.com/x5hTytderV
— Narendra Modi (@narendramodi) February 19, 2022