భూపాల్: మధ్యప్రదేశ్లోని మోరెనా పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్ద కనిపించిన ఓ హృదయవిదారక దృశ్యం స్థానిక ప్రజలను కంటతడిపెట్టించింది. ఓ వైపు చనిపోయిన తన తమ్ముడు తలను ఒళ్లో పెట్టుకుని ఎనిమిదేళ్ల చిన్నారి ఎవరికోసమో నిరీక్షిస్తున్నాడు. మరోవైపు కన్న బిడ్డ చనిపోయిన ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేని దుస్థితిలో ఉన్న పేద తండ్రి పట్టణంలో ఏదైనా వాహనం దొరక్కపోతుందా అన్న ఆశతో పట్టణమంతా చెప్పులరిగేలా తిరుగుతున్నాడు.
మోరెనా పట్టణంలో స్థానిక జర్నలిస్ట్ చిత్రీకరించిన విజువల్స్లో, 8 ఏళ్ల గుల్షన్ తన 2 ఏళ్ల సోదరుడు రాజా మృతదేహంతో కూర్చున్నట్లు కనిపించాడు, వారి తండ్రి పూజారామ్ జాతవ్ వారిని ఇంటికి తీసుకెళ్లడానికి వాహనం కోసం తీవ్రంగా వెతుకుతున్నాడు.
మధ్యప్రదేశ్లో అంబాహ్లోని బద్ ఫ్రా గ్రామ నివాసి పూజారామ్ జాతవ్ తన రెండేళ్ల కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో భోపాల్లోని మోరెనా జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్ సాయంతో తన కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ ఆ చిన్నారి రక్తహీనత, అసిటిస్తో బాధపడుతూ చికిత్స సమయంలోనే మరణించాడు. అయితే వారిని తీసుకొచ్చిన అంబులెన్స్ అప్పటికే తిరిగి వచ్చింది. దీంతో పూజరామ్ జాతవ్ తన కొడుకు మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయాలని ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని వేడుకున్నాడు. దీనికి ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు.
దీంతో చేసేదేమీ లేక తన పెద్ద కొడుకు గుల్షన్ ఒడిలో తన కొడుకు మృతదేహాన్ని ఉంచి వాహనం తీసుకువస్తాని చెప్పి వారిని మోరీనా నెహ్రూ పార్క్ వద్ద ఉంచి వెళ్లాడు. ఐతే పూజారామ్కి ఎంత ప్రయత్నించిన ఏ వాహనం దొరకలేదు.
పాపం ఆ చిన్నారి చనిపోయిన తన తమ్ముడు తలను ఒళ్లో పెట్టుకుని తండ్రి కోసం నిరీక్షిస్తున్నాడు. ఒక పక్క ఈగలు వాలుతూ ఉంటే వాటిని కొడుతూ ఏడుస్తూ కూర్చున్నాడు. ఐతే స్థానిక జనం అధికారులకు సమాచారం ఇవ్వడంతో…పోలీస్ అధికారి యోగేంద్ర సింగ్ అసలు విషయం తెలుసుకొని పూజారామ్కి సదరు స్థానిక ఆస్పత్రి నుంచే అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపించండతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.