25.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

హుస్సేన్ సాగర్ పై ఫ్లోటింగ్ బ్రిడ్జి… హెచ్ఎండీఏ కమిషనర్ వెల్లడి!

హైదరాబాద్: విశ్వనగరం హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. నగరంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం హుస్సేన్ సాగర్ పై వేలాడే వంతెన రాబోతోంది. మాస్కో తరహా మోడల్ లో హైదరాబాద్ లోనూ ఈ మేరకు నిర్మాణం చేపట్టేలా కేసీఆర్ సర్కారు ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కమిషనర్ అర్వింద్ కుమార్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
రష్యా రాజధాని మాస్కోలోని నదీ తీరంలో నిర్మించిన తేలియాడే వంతెన లాంటిదే హుస్సేన్‌ సాగర్‌ చెంతనా రాబోతోందని, ఈ ఏడాది(2022) ఆఖరు నాటికి నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ తెలిపారు.
రష్యా రాజధాని మాస్కోలోని జర్యాడే పార్క్‌లో మోస్క్వా నదిపై తేలియాడే వంతెన ఉంది. ఆ దేశంలో ఉత్తమ పర్యాటక ప్రాంతాల్లో ఆ బ్రిడ్జి ఒకటిగా నిలుస్తోంది. నది లోపలకి యూ ఆకారంలో దాదాపు 70 మీటర్ల పొడవుతో నిర్మించారు. వంతెన కింద 13 మీటర్ల దూరం నుంచి మోస్వ్యా నది ప్రవహిస్తుంది. ఈ వంతెనపై ఉంటే నదిలో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. నది లోపల ఎలాంటి స్తంభాలు లేకుండా రోప్‌వే ద్వారా దీనిని తీర్చిదిద్దిన విధానం ఇంజినీరింగ్‌లో ఓ అద్భుతంగా నిపుణులు పేర్కొంటారు. దీని నిర్మాణంలో పారదర్శకమైన గాజును వినియోగించారు. ఫలితంగా వంతెనపై నిల్చొని కిందకు చూస్తే… నది అలలు, అందాలు స్పష్టంగా కనిపిస్తాయి. వంతెన డెక్‌ మొత్తం పొడవు 244 మీటర్లు. ఒకేసారి వంతెనపై 2400 మంది వరకు నిల్చొని నది అందాలతో పాటు జుర్యాడే పార్కు, రెడ్‌ స్క్వేర్‌ కళా చిత్రాలను తనివి తీరా చూడవచ్చు.
అత్యాధునిక టెక్నాలజీతో దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ఇప్పటికే హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏర్పాటుకానున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి నగర ఖ్యాతిని మరింత పెంచనుంది. నెక్లెస్‌ రోడ్డు వద్ద హుస్సేన్‌ సాగర్‌పై ఇలాంటి వంతెను వస్తే హైదరాబాద్‌ పర్యాటక ముఖచిత్రమే మారిపోనుంది. ఇప్పటికే ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్డును ఏటా లక్షలాది మంది వీక్షిస్తుంటారు. త్వరలో ట్యాంక్‌బండ్‌ వద్ద నైట్‌ బజార్‌ ఏర్పాటు కానుంది. గతంలో ట్యాంక్‌బండ్‌పై ‘లండన్‌ ఐ‘ ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రచించినా ప్రాజెక్టు ముందుకు కదలలేదు. అదే తరహాలో మరో ప్రాజెక్టు రూపకల్పనకు అడుగులు పడుతుండటంతో హైదరాబాదీల్లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి వంతెన వస్తే పర్యాటకంగా హైదరాబాద్‌కు మరింత ఆకర్షణ రానుంది. గతంలో అనుకున్న కొన్ని ప్రాజెక్టుల మాదిరిగా ఈ వేలాడే వంతెన నిలిచిపోయే ఛాన్స్ లేదు. తప్పకుండా పనులు మొదలుపెట్టి ఈ ఏడాది ఆఖర్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ఎన్నో వింతలు, విశేషాలు, చారిత్రక నేపథ్యంతో దేశంలోనే ప్రత్యేక నగరంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ నగరానికి ఈ వంతెన మరో ఆకర్షణగా మారడం ఖాయం అంటున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles