హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు భారీ సంఖ్యలో విద్యార్థులు డుమ్మా కొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (గణితం పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II) పరీక్షకు 15,700 మందికి పైగా మంగళవారం గైర్హాజరయ్యారు. మొత్తం 4,44,384 మంది అభ్యర్థులకు గానూ.. 4,28,664 మంది హాజరు అయ్యారు. 3.5 శాతం మంది ఆబ్సెంట్ అయ్యారు.
పరీక్ష సమయంలో నల్గొండలో రెండు, వనపర్తి జిల్లాలో మూడు మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. పరీక్షను పర్యవేక్షించేందుకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఐఈ) నల్గొండ, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, హైదరాబాద్ జిల్లాలకు పరిశీలకులను పంపింది.
ఇంటర్ వార్షిక పరీక్షలకు భారీ సంఖ్యలో విద్యార్థులు డుమ్మా కొడుతున్నారు. నాలుగు రోజుల క్రితం శుక్రవారం ఒక్కరోజే 20,259 (4%) మంది ఫస్టియర్ విద్యార్థులు ఇంగ్లిష్ పరీక్షకు గైర్హాజరయ్యారు. దీనికి మొత్తం 5,02,018 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉన్నది. కానీ, 4,81,759 మంది విద్యార్థులే పరీక్ష రాసినట్టు ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపిన సంగతి విదితమే.