హైదరాబాద్: బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీమ్స్, పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ డా.తరుణ్ జోషి అన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ ఆపరేషన్లు చేస్తున్నాయని తెలిపారు.
బాలికలను, మహిళలను వెంబడించే.. వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు చెప్పారు. కమిషనరేట్ పరిధిలో మహిళలను, యువతులను వేధింపులకు గురిచేసిన 147 (మేజర్స్-87, మైనర్స్-60) మందిని షీ టీమ్స్ పట్టుకున్నాయి. షీ టీమ్స్ ప్రకారం, మే 16 నుండి 31 వరకు తమకు 183 ఫిర్యాదులు అందాయి. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (మహిళల భద్రతా విభాగం) ఉషా విశ్వనాథ్ మాట్లాడుతూ… ఫోన్ ద్వారా వేధించిన కేసులు 30, సోషల్ మీడియా ద్వారా 42,ప్రత్యక్షంగా వేధింపులకు సంబంధించిన 111 కేసులు ఉన్నాయి. ఫిర్యాదులను అనుసరించి, 11 కి పైగా క్రిమినల్ కేసులు బుక్ చేశారు. వాటిలో 83 మైనర్లకు సంబంధించినవి.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆడవారికి ఎదురయ్యే వేధింపుల నుంచి రక్షించేందుకు రాచకొండ షీ టీమ్స్ పోలీసులు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. పురుషులు మహిళల పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని సూచించారు. స్త్రీలను గౌరవించడం వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదన్నారు. అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే షీ టీమ్స్ రాచకొండ వాట్సాప్ నెంబర్ 8712662111 ద్వారా లేదా ఆయా ప్రాంత షీ టీమ్ అధికారుల నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
- భువనగిరి ఏరియా- 8712662598,
- చౌటుప్పల్ ఏరియా-8712662599,
- ఇబ్రాహీంపట్నం ఏరియా -8712662600,
- కుషాయిగూడ ఏరియా -8712662601,
- ఎల్బీనగర్ ఏరియా -8712662602,
- మల్కాజిగిరి ఏరియా-8712662603,
- వనస్థలిపురం ఏరియా -8712662604కు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశం, అడ్మిన్ ఎస్ఐ రాజు, షీ టీమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.