హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కలల ప్రాజెక్టు అయిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదటి పంప్ ట్రయల్ రన్ను బుధవారం రాత్రి విజయవంతంగా పరీక్షించారు. చరిత్రలో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది.
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బి.జి కొత్తూరు వద్ద నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో సీతారామ ప్రాజెక్టు ఫేస్-1 పంప్ హౌస్ మోటార్ ను ఆన్ చేసి దిగువన ఉన్న కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఈ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఇరిగేషన్ అధికారులు సంబరాలు చేసుకున్నారు.
సీతారామ ప్రాజెక్ట్ మోటర్ల ట్రయల్ రన్ సక్సెస్ కావటంతో త్వరలో ఇక్కడ రైతాంగానికి సాగు నీరు అందుతుంది. ఖమ్మం జిల్లాలో 1.57 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.62 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 9 వేల ఎకరాలు, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 2.48 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్త ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు.
విజయవంతమైన ట్రయల్ రన్ గురించి తెలుసుకున్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంపుహౌస్ వద్దకు చేరుకుని ప్రాజెక్టు నుంచి.. గోదావరి జలాలు ఉప్పొంగుతుంటే.. మంత్రి తుమ్మల పరవశించిపోయారు. ఆనందంతో భూమాతకు సమస్కరించారు. త్వరగా పనులు పూర్తి చేసి నీటిని అందించాలంటూ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని బంజరు భూములకు గోదావరి జలాలు ఇవ్వడమే తన చివరి కోరిక అని మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. గోదావరి జిల్లాల మాదిరిగా ఖమ్మం జిల్లాలో సాగునీరు ఇవ్వాలన్నది తన ఏళ్లనాటి కల అని తెలిపారు. తన రాజకీయ ఆశయం ప్రాజెక్టు అమలుతో నెరవేరిందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు కృషి చేసిన అధికారులకు, ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.
వైరా ప్రాజెక్టు, లంకా సాగర్ ప్రాజెక్టుతో ప్రధాన కాలువను అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుల మధ్య ఉన్న మైనర్ ఇరిగేషన్ చెరువులను నింపవచ్చని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆయకట్టు కింద లక్షన్నర ఎకరాలకు నీరందించాలని ఇరిగేషన్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.
ఈ ఘనత సాధించిన నీటిపారుదల సలహాదారు పెంటారెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి, తమ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
‘కేసీఆర్ కల నెరవేరింది’: కేటీఆర్ సంతోషం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గురువారం X లో పోస్ట్ చేశారు.
‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కల సాకారమైన తరుణం ఇది. సీతారామ ప్రాజెక్టు తన హృదయం లాంటిదని కేసీఆర్ చాలా కాలం క్రితమే చెప్పారు. ఖమ్మంను శాశ్వతంగా కరువు విముక్తం చేసే ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రాణం పోశారు. గతంలో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆయన బాటలు వేశారు. దశాబ్దాలుగా మోసపోయిన ఖమ్మం రైతులకు ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందిస్తాం’’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.