హైదరాబాద్: విప్రో కన్స్యూమర్ కేర్ & లైటింగ్ తన కొత్త ఫ్యాక్టరీని మంగళవారం హైదరాబాద్లోని మహేశ్వరంలో ప్రారంభించింది. పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు, విప్రో గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ ఈ పరిశ్రమను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రకరణ్ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, విప్రో కన్స్యూమర్ కేర్ సీఈవో వినీత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. విప్రో కన్స్యూమర్ కేర్ 2018లో మహేశ్వరంలో 30 ఎకరాల భూమిని తీసుకుని 300 కోట్లతో ఈ నిర్మాణాన్ని ప్రారంభించింది.
ప్రస్తుత విప్రో కంపెనీ సంతూర్ సబ్బులు, సాఫ్ట్టచ్ ఫాబ్రిక్ కండీషనర్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది యార్డ్లీ టాల్కమ్ పౌడర్, సంతూర్ హ్యాండ్ వాష్, గిఫ్ఫీ డిష్ వాష్లను ఉత్పత్తి చేయడానికి తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా నిమిషానికి 700 సబ్బులను తయారు చేస్తారు.
ఈ సందర్భంగా విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకంగా ఉందని అన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణ కీలకంగా నిలిచిందని ప్రశంసించారు. తెలంగాణలో నిరంతరంగా పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నామని చెప్పారు. పెట్టుబడులతో ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నామని తెలిపారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… టీఎస్ ఐపాస్ ద్వారా సరళతర వాణిజ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి అన్నారు. అజీమ్ ప్రేమ్జీ వంటి వ్యక్తి మన మధ్య ఉండటం గొప్ప విషయమన్నారు. ఆయన జీవితం అందరికీ అనుసరణీయం, మంచి పాఠంలాంటిదని కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం అందిరికీ ఆదర్శమని కేటీఆర్ అన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 900 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. విప్రో పరిశ్రమలో స్థానికంగా ఉన్న కందుకూరు, మహేశ్వరం ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కేటీఆర్ వివరించారు.
దాదాపు రూ.300 కోట్లతో విప్రో పరిశ్రమ ఏర్పాటు చేశారని.. కాలుష్యం బయటకు విడుదల కాకుండా జర్మన్ సాంకేతికతను ఉపయోగిస్తూ అన్ని చర్యలు తీసుకున్నట్లు కేటీఆర్ వివరించారు. టీఎస్ ఐపాస్ విధానం ద్వారా రాష్ట్రంలో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త పరిశ్రమలకు రాయితీలు, మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.2,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. తద్వారా ఏడేళ్లలో 16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించారు. కరోనా సమయంలో అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలను అభినందించిన కేటీఆర్.. ప్రేమ్జీ దాతృత్వాన్ని కొనియాడారు. ఎల్ఈడీ పరిశ్రమతో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు.
Ministers @KTRTRS, @SabithaindraTRS along with @Wipro Group Founder Chairman Sri Azim Premji inaugurated Wipro manufacturing facility in Maheshwaram. pic.twitter.com/xPYAwSSq4R
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 5, 2022