హైదరాబాద్: ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద అటు నుంచి వచ్చే వాహనాలు లేకపోయినా ఒక్కోసారి గ్రీన్ సిగ్నల్ వెలుగుతూనే ఉంటుంది. వాహనాలు నిలిచిపోయి ఎదురుచూస్తున్న వైపు చాలా సేపు రెడ్ సిగ్నల్ ఉంటుంది. ఆటోమెటిక్ ‘సిగ్నల్ సైకిల్’ కారణంగా గ్రీన్ లైట్ పడిన రహదారులు ఖాళీగా ఉంటుండగా, రెడ్ లైట్ ఉన్న రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. సిగ్నళ్ల వద్ద తరచూ కనిపించే సమస్య ఇది. ఈ కారణంగా ట్రాఫిక్ పోలీసులు అనేక కూడళ్లలో మాన్యువల్గా సిగ్నళ్లను ఆపరేట్ చేయాల్సి వస్తోంది. అలా లేనిచోట్ల వాహనదారులు తమ వంతు కోసం ఎదురు చూడాల్సిందే.
ఇటు వాహనదారులకు, అటు పోలీసులకు తలనొప్పిగా మారిన ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎట్టకేలకు ఒక పరిష్కారం దొరికింది. అదే.. అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం (ATCS). ట్రాఫిక్ సిగ్నళ్లు అనుసంధానించి ఉండే సర్వర్ ద్వారా ఏ జంక్షన్లో, ఏ రహదారిలో, ఎంత ట్రాఫిక్ ఉంది? అనేది సాంకేతికంగా తెలుసుకొని సిగ్నల్స్ సైకిల్లో మార్పు తీసుకురానున్నారు. ఇందు కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో (ITMS) అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం (ATCS) విధానాన్ని అమలు చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ పద్ధతుల ద్వారా మొత్తం 384 సిగ్నల్స్ ఏర్పాటు లక్ష్యం కాగా, అందులో హెచ్ ట్రీమ్స్ ద్వారా 234, ఏటీఎస్సీ పద్ధతి ద్వారా 150 ఏర్పాటుకు ప్రతిపాదించగా, వివిధ కారణలైన యూ టర్న్, ఫె్లై ఓవర్లు, సైట్ ఫెసిబిలిటి లేకపోవడంతో 50 సిగ్నల్స్ను తొలగించారు. మిగతా 334లలో హెచ్ ట్రీమ్స్ 212, ఏటీఎస్సీ 122 ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందులో ప్రస్తుతం 199 హెచ్ ట్రీమ్స్ 73, ఏటీఎస్సీ ద్వారా మొత్తం 179 సిగ్నళ్ల ఏర్పాటును అందుబాటులోకి తెచ్చారు. ఇంకా 44 సిగ్నల్స్ ప్రగతి దశలో ఉన్నాయి. మరో 18 లొకేషన్లను నిర్ణయించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న సిగ్నల్ ఏర్పాటు పూర్తయితే హెచ్ ట్రీమ్స్ సిస్టమ్తో 212 సిగ్నల్స్, ఏటీఎస్సీ సిస్టమ్తో 122 నగరంలో మొత్తం 334 సిగ్నల్స్ ఏర్పాటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
నగర వ్యాప్తంగా అడాప్టెడ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ (ఏటీఎస్సీ) సిస్టమ్ ద్వారా పాదచారుల ప్రమాదాల నివారణకు పెలికాన్ సిస్టమ్ ద్వారా సిగ్నల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. కారిడార్లో ఉన్న సిగ్నల్స్ను కేంద్రీకృతంగా నియంత్రించడం, ట్రాఫిక్కు అనుగుణంగా సిగ్నల్ టైమింగ్ మార్చుకునే వెసులుబాటు, ట్రాఫిక్ను కెమెరాలో రికార్డు చేసే సెన్సార్ ఏర్పాటు, పవర్ బ్యాక్ అప్ కోసం సోలార్, బ్యాటరీ ఏర్పాటు, మెరుగైన ప్రయాణం, వెయిటింగ్కు తక్కువ సమయం, సిగ్నల్స్ వ్యవస్థతో రోడ్డు భద్రతా పెరుగుదల నగర ప్రజలకు సురక్షిత ప్రయాణానికి జీహెచ్ఎంసీ కృషి చేస్తున్నది.