హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ముస్లింలు నేడు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. త్యాగనిరతికి, దైవ భీతికి, ధాతృత్వానికి ప్రతీక బక్రీద్ పర్వదినం. ఇబ్రాహీం ప్రవక్త త్యాగస్ఫూర్తిని పునరుజ్జీవింపచేసుకోవడమే ఈ పండుగ లక్ష్యం. ఈదుల్జుహా నమాజ్ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులు ఒకరికొకరు శుభాంకాక్షలు తెలుపుకున్నారు.
ఈదుల్ అదా పర్వదినాన్ని ఆదివారం హైదరాబాద్లోఘనంగా జరుపుకున్నారు. నగరంలోని వివిధ ఈద్గాలు మరియు మసీదులలో వర్షం కురుస్తున్నప్పటికీ అనేక మంది ముస్లింలు ఈద్ సామూహిక ప్రార్థనలకు హాజరయ్యారు. మీర్ ఆలం ఈద్గా, ఖదీమ్ (పాత) ఈద్గా మాదన్నపేట్, మక్కా మసీదు, మాసబ్ ట్యాంక్ వద్ద హాకీ గ్రౌండ్స్ మొదలైన వాటిలో ఈద్ నమాజ్ చదివారు.
మీర్ ఆలం ఈద్గాలో మక్కా మసీదు ఖతీబ్ మౌలానా హఫీజ్ రిజ్వాన్ ఖురేషీ ఈద్ ఉల్ అదా ప్రార్థనలకు నాయకత్వం వహించారు. పలువురు ప్రముఖులు, మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.
నగరంలో శాంతిభద్రతలు నెలకొనేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని సున్నిత ప్రాంతాలలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, డీజీపీ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు నగరంలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ హా) అని కేసీఆర్ అన్నారు. భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్ పండుగ చాటి చెప్తుందని అన్నారు.
దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారన్నారు ఏపీ సీఎం జగన్. భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి అభిలషించారు.