హైదరాబాద్: ఎల్బీనగర్ పరిథిలోని నాగోల్, స్నేహపురికాలనీలో కాల్పుల కలకలం రేగింది. మహదేవ్ జువెలరీ షాపులో చొరబడిన దొంగలు దుకాణంలో కాల్పులకు పాల్పడి బంగారం ఎత్తుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరు చికిత్స పొందుతున్నారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి నగల దుకాణం పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల సహాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. క్లూస్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతోంది.
దుకాణం యజమానితో విభేదాలు ఉన్న వారెవరైనా ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ నేరానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గతంలోనూ తెలంగాణ, ఏపీలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సందర్భాలు ఉండటంతో ఆయా ఘటనలకు పాల్పడిన వారే ఈ ఘటనకు కూడా పాల్పడ్డారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
జ్యువలరీ షాపు కాసేపట్లో మూసి ఇంటికి వెళ్లాలనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా షాపులోకి చొరబడిన దుండగులు యజమానిని బెదిరించే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. 3 పర్యాయాలు కాల్పులు జరిపినట్లు సమాచారం. బంగారం డెలివరీ చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని.. ఈ దుండగులు ఫాలో అయ్యారు. బంగారు నగలు కొనుగోలు చేసేందుకుకు వచ్చినట్లు షాపులోకి దూరిన దుండగులు, దుకాణ షట్టర్స్ను క్లోజ్ చేసి బెదిరింపులతో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.