హైదరాబాద్ : ఏజెన్సీ గ్రామాల్లో తునికాకు సేకరణ.. గిరిజన, గిరిజనేతర కూలీలకు వేసవిలో మంచి ఉపాధిగా మారింది. ఈ పరిస్థితుల్లో తునికాకు సేకరించే కూలీలకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో… సేకరించిన తునికాకును విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని తిరిగి సేకరణదారులకే చెల్లించాలని ప్రభుత్వం సైతం నిర్ణయించింది. అందుకనుగుణంగా రెవెన్యూ నెట్ షేర్ (బోనస్)ను కూడా ప్రభుత్వం చెల్లించేందుకు ముందుకొచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా 2016 నుంచి 2021 వరకు రూ.200 కోట్లను బోనస్ను చెల్లించే కార్యక్రమాన్ని సోమవారం అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం కర్జెల్లి అటవీరేంజ్ చింతలమానేపల్లిలో ప్రారంభించారు.
ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కుతో కలిసి మంత్రి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో తునికాకు కూలీలకు రూ. 31.58 కోట్లు బోనస్ చెల్లించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 63,573 మంది లబ్ధిదారులకు రూ. 31.58 కోట్లు, సిర్పూర్ నియోజకవర్గంలో 48,418 మంది లబ్ధిదారులకు రూ.26.98 కోట్లు చెల్లించారు.
‘‘సీజన్లో బీడీ ఆకు సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 2.27 లక్షల స్టాండర్డ్ బస్తాల ఆకులను సేకరించి విక్రయించాలన్నది లక్ష్యం. మే నెలాఖరులోగా దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. బీడీ ఆకు ధరను రూ.2.05 నుంచి రూ.3కు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ రేట్లు ప్రస్తుత సీజన్ నుంచి అమల్లోకి వస్తాయని రెడ్డి చెప్పారు.
సుమారు 75,000 మంది బీడీ ఆకు సేకరించేవారు ఈ సీజన్లో ఆకు సేకరణలో పాలుపంచుకోనున్నారు. 2023లో అటవీ శాఖ ఆధ్వర్యంలోని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డిసి) 19 జిల్లాల్లోని 225 యూనిట్లలో విక్రయాలు జరుపుతుందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని మూసివేసే ప్రమాదం ఉన్నందున పేదలు ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తునికాకు కట్ట సేకరణ ధర పెంచారని చెప్పారు.