హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం పదకొండు గంటలపాటు ప్రశ్నించారు. అయితే మొత్తం 11 గంటల్లో కేవలం 14 ప్రశ్నలు మాత్రమే ఈడీ బృందం కవితను అడిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తాను ఎలాంటి తప్పూ చేయలేదని, చేయనని ఈడీ దర్యాప్తులో కవిత స్పష్టంచేశారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే తనను దురుద్దేశంతో విచారిస్తున్నారని ఆమె ఈడీ అధికారులతో అన్నట్లు తెలిసింది. ఈడీ విచారణలో పారదర్శకత లేదని పలుమార్లు తేల్చిచెప్పిన కవిత.. అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని విచారణ అధికారుల మొహం మీదే చెప్పినట్టు రాజకీయవర్గాలు తెలిపాయి. కవిత విజ్ఞప్తి మేరకు కేంద్ర ఏజెన్సీ అధికారులు మొత్తం ప్రశ్నోత్తరాల ప్రక్రియ ఆడియో, వీడియో రికార్డింగ్కు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.
‘ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో నన్ను నిందితురాలిగా పిలిచారా?’ అని ప్రశ్నించారు. ‘కాదు..’ అని అధికారులు సమాధానం ఇచ్చారని తెలిసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా ఇంత తొందరగా విచారించాల్సిన అవసరం ఏముందని కవిత ప్రశ్నించారని సమాచారం. అలాగే తను ఫోన్ ధ్వంసం చేసినట్టు. మీడియాకు లీకులెవరిచ్చారని కూడా కవిత ప్రశ్నించారు.
గత విచారణలో స్వాదీనం చేసుకున్న తన ఫోన్ పూర్తిగా చెక్ చేసుకోవచ్చని అన్నారు. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే అధికారులు విచారిస్తున్నారని, అయినా విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు. కాగా సోమవారం కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్న గంట తర్వాత అధికారులు వచ్చారని, చాలాసేపు కవిత ఒక్కరినే రూమ్ కూర్చోబెట్టారని సమాచారం.