న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరియు వినేష్ ఫోగట్లతో సహా రెజ్లర్ల నిరసనల మధ్య, హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఢిల్లీ పోలీసులు, సుప్రీం కోర్టు ఆదేశించిన కొన్ని గంటల తర్వాత రెండు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టులు (ఎఫ్ఐఆర్లు) దాఖలు చేశారు.
వాస్తవానికి మైనర్పై అత్యాచారం చేసినందుకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇది బెయిల్కు అవకాశం ఇవ్వదు. ఢిల్లీ పోలీసులు ఈ కేసును చురుగ్గా విచారించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తనపై లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసు కేసు నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్వాగతించారు.
అదే సమయంలో, ఈ మొత్తం విషయంపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కూడా తన వివరణ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ.. నేను చట్టాన్ని గౌరవిస్తాను, ఇంతకుముందు కూడా ఇలాగే చేశాను. ఇప్పుడు ఈ అంశం సుప్రీంకోర్టులో ఉందని, నేను తప్పించుకోను, అలాగే నేను నా నివాసంలో ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తున్నాను. అంతే కాకుండా సుప్రీంకోర్టు తీర్పుపైనా, పోలీసుల దర్యాప్తు ప్రక్రియపైనా నాకు నమ్మకం ఉందని అన్నారు. దర్యాప్తులో ఎక్కడ నా సహకారం కావాలన్నా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు.
పోలీసు చర్యకు హామీ ఇచ్చినప్పటికీ, డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ను “తక్షణమే అరెస్టు చేయాలని” డిమాండ్ చేస్తూ రెజ్లర్లు తమ నిరసనను కొనసాగిస్తామని చెప్పారు.
“మేము సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తాము, కానీ మాకు ఢిల్లీ పోలీసులపై నమ్మకం లేదు. ఈ పోరాటం ఎఫ్ఐఆర్ కోసం కాదు. ఈ పోరాటం అతనిలాంటి వారిని శిక్షించడానికి. బ్రిజ్ భూషణ్ జైలులో ఉండాలి. అతని పోర్ట్ఫోలియోలను తీసివేయాలి” అని రెజ్లర్లు అన్నారు.