హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లు సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబడతాయని ఆర్బీఐ తెలిపింది. తాజా డినామినేషన్ నోట్ల ముద్రణ ఉండదు.
ఇప్పటికే ఇతర డినామినేషన్లలో తగినన్ని నోట్ల నిల్వలు చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ పత్రికా ప్రకటన తెలిపింది. ఇతర డినామినేషన్ నోట్ల లభ్యత, బ్యాంకు ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
రూ.2 వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తమ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసి వాటికి సమానమైన విలువ కలిగిన ఇతర నోట్లను తీసుకోచవచ్చని తెలిపింది. మే 23, 2023 నుంచి ఏ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి అయినా ఈ నోట్లను మార్చుకోవచ్చు.
అలాగే దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అకౌంట్లో డిపాజిట్ చేసేందుకు ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు లేవు. అయితే, బ్యాంక్ సేవలకు అంతరాయం కలగకుండా ఒకసారి రూ.20,000 వరకు మాత్రమే ఈ పెద్ద నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.
₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation; Will continue as Legal Tenderhttps://t.co/2jjqSeDkSk
— ReserveBankOfIndia (@RBI) May 19, 2023
2018లోనే ప్రింటింగ్ నిలిపివేత..
రూ.2000 నోట్లను ఆర్బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం నవంబర్, 2016లో చలామణిలోకి తీసుకొచ్చారు. రూ.500, రూ.1000 పెద్ద నోట్ల రద్ద తర్వాత దేశీయ కరెన్సీ అవసరాలను తీర్చేందుకు ఈ పెద్ద నోటను అందుబాటులోకి తీసుకొచ్చంది రిజర్వ్ బ్యాంక్. అయితే, ఇతర కొత్త నోట్లు సరిపడా అందుబాటులోకి వచ్చిన క్రమంలో రూ.2000 నోట్ల ముద్రణను 2018-19లో నిలిపివేసింది. మార్చి 2017 నాటికి 89 శాతం నోట్లను జారీ చేశారు. మార్చి 31, 2028 నాటికి చలామణిలో గరిష్ఠంగా రూ.6.73 లక్షల కోట్లు (37.3శాతం) రెండు వేల నోట్లు ఉండగా మార్చి 31, 2023 నాటికి అది సర్క్యూలేషన్లో 10.8 శాతానికి పడిపోయింది.