హైదరాబాద్: ఢిల్లీలో సర్వాధికారాలు మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై సీఎం కేజ్రీవాల్ యుద్దాన్ని తీవ్రం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. అందులో భాగంగా నేడు సీఎం కేసీఆర్ను కలవనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామిక ఆర్డినెన్స్’కు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు కోరతానని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత శుక్రవారం ట్వీట్ చేశారు.
సుప్రీం కోర్టు బ్యూరోక్రాట్ బదిలీల నియామకాలపై కేంద్రం కాదు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వమే నియంత్రణ కలిగి ఉంటుందని ఆదేశాలిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును కాదని, ఆర్డినెన్స్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతకాల సమావేశంలో ఆమెదించిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీని, మల్లిఖార్జున్ ఖర్గేని కలిసి, సమావేశమయ్యేందుకు సమయం కావాలని విపక్ష పార్టీలను కలుస్తున్నారు.
మే 25న, కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి ముంబైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ను కలిసి మద్దతు కోసం పిలుపునిచ్చారు. శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రేతో కూడా ఆప్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడానికి కేజ్రీవాల్ అంతకుముందు కోల్కతా వచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, తృణమూల్ కాంగ్రెస్ దానిని వ్యతిరేకిస్తుందని ఆమె హామీ ఇచ్చారు.