ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఇటీవల చోటుచేసుకున్న హింసాకాండను పరిష్కరించే ప్రయత్నంలో, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ సోమవారం బాధిత వ్యక్తులకు మద్దతునిచ్చారు. అంతేకాదు విద్యార్థులకు విద్యా ఏర్పాట్లకు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు కొనసాగడానికి వీలు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ అనేక కీలక ప్రకటనలు చేశారు, హింసాకాండ తర్వాత వందలాది మంది సహాయక శిబిరాల్లో కొనసాగుతున్నందున నిర్వాసితులకు ఇళ్లు, విద్యార్థులకు విద్యా ఏర్పాట్లకు హామీ ఇచ్చారు.
అధికారిక రికార్డుల ప్రకారం హింసాత్మక పరిస్థితులలో దాదాపు 47,000 మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేశారు. హింసాకాండలో వందలాది మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు భుజం భుజం కలిపి ఇళ్లు నిర్మించి ఇస్తుందని బీరెన్ సింగ్ ప్రజలకు హామీ ఇచ్చారు. హింసాకాండ కారణంగా నిర్వాసితులైన వారి కోసం దాదాపు 4000 ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. బ్లూప్రింట్ ఇంకా ఖరారు కాలేదని, అయితే అలాంటి ఇళ్లను రెండు గదులతో నిర్మించాలని చూస్తున్నామని ఆయన చెప్పారు. పిల్లలువిద్య వెనుకంజ వేయకుండా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
“చురాచంద్పూర్ నుండి ఇంఫాల్లోని శిబిరాల్లో ఉన్న వారిని ఇక్కడ ఇంఫాల్లోని పాఠశాల, కళాశాలలకు పంపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి” అని ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో చెప్పారు.
హింసాకాండ కారణంగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి ప్రస్తుతం శిబిరాల్లో తాత్కాలిక ఆశ్రయాల్లో ఉన్నారు. వీరిలో చాలా మంది దగ్గర ఎలాంటి డాక్యుమెంటేషన్ లేదు. ముఖ్యంగా ఆధార్ కార్డ్లు సైతం వారిదగ్గర లేవు.
కేంద్ర, రాష్ట్రంలోని అనేక సంక్షేమ పథకాలు చాలా వరకు ఆధార్తో అనుసంధానించబడినందున, ఆధార్ కార్డులను తిరిగి జారీ చేయడానికి నిబంధనలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పిలుపునిచ్చింది.
“ఆధార్ కార్డులను కోల్పోయిన వారి కోసం వాటిపి తిరిగి జారీ చేయడంలో సహాయం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఆశ్రయం శిబిరాల్లోనే ఆధార్ను పొందేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఇటీవలి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్పై నిషేధాన్ని జూన్ 15 వరకు పొడిగించింది.
మే 29న.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాలుగు రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శించారు, ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పౌర సమాజం, మహిళా సంఘాలు, గిరిజన సంఘాలు, భద్రతా సిబ్బందితో సమావేశమయ్యారు. .
రాష్ట్రంలో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని షా ప్రకటించారు. హోంమంత్రి ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే కమిటీని ఏర్పాటు చేశారు.
మే 3న మణిపూర్లో హింస చెలరేగింది. తమను షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)లో చేర్చాలన్న మైతీల డిమాండుకు అనుకూలంగా నాలుగు వారాల్లో కేంద్రానికి సిఫార్సు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని మణిపూర్ హైకోర్టు ఆదేశించడంతో హింస చెలరేగింది. మైతీల డిమాండును మైనారిటీలైన కుకీ, నాగా గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల అనంతరం గిరిజన సంఘాలు నిర్వహించిన ర్యాలీలో ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలు దాడులు, ప్రతిదాడులు చేసుకోవడంతో రాష్ట్రం అట్టుడికిపోయింది. షెడ్యూల్డ్ తెగలో మెయిటీ కమ్యూనిటీని చేర్చాలనే డిమాండ్కు నిరసనగా ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ATSU) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
హింసను నియంత్రించేందుకు కేంద్ర పారామిలటరీ బలగాలను రాష్ట్రంలో మోహరించారు. మరోవంక ఇరు వర్గాలకు చెందిన శాసనసభ సభ్యులతో సహా కుకి, నాగా కమ్యూనిటీకి చెందిన ప్రతినిధులు ఢిల్లీకి వచ్చి తమ ప్రాతినిధ్యాలు మరియు డిమాండ్తో హోం మంత్రి అమిత్ షాతో సహా బిజెపి అగ్ర నాయకులను కలిశారు.