హైదరాబాద్: ఎల్బీ నగర్లోని సాగర్ రింగ్రోడ్డు కూడలి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల్లో ఉన్న ఫ్లైఓవర్ ర్యాంప్ ఒక్కసారిగా కుప్పకూలింది. జూన్ 21 తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో కొంత మంది గాఢ నిద్రలో ఉండగా ఘటన జరిగినట్లు సమాచారం.
ఈ ఘటనలో 8 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కార్మికులంతా బీహార్, ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందించిన వెంటనే రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన కార్మికుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఎల్బీ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… కార్మికులు స్లాబ్ వేస్తుండగా చిన్నపాటి స్ట్రెచ్ కూలిపోయిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్లైఓవర్ పనులు ఇంకా కొనసాగుతున్నందున నాణ్యత లేని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోలేమని ఏసీపీ తెలిపారు. సంఘటనా స్థలాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చుహాన్, ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీలు సందర్శించారు.
స్థానిక ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. పనుల్లో నాణ్యత లోపం, నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ స్థానిక నేతలు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ట్విటర్లో స్పందిస్తూ పరిస్థితి అదుపులో ఉందని, అవసరమైతే చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ఫ్లై ఓవర్ ప్రమాదంలో గాయపడిన వారికి మంత్రి కేటీఆర్ పరామర్శ
కిమ్స్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. క్షతగాత్రుల వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా జేఎన్టీయూ యూనివర్సిటీ ఇంజినీర్లతో కూడా విచారణ జరిపిస్తామన్నారు. వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తేలితే, కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు.