హైదరాబాద్: వినూత్న ఆలోచనలతో తెలంగాణ ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఎండీ వి.సి.సజ్జనార్ ప్రయాణికులకు మరో తీపి కబురు అందించారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీకి ఆదాయాన్ని తెస్తున్న ఆయన మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు అవతలి వైపు ఉన్న (సీబీఎస్) సిటీ బస్టాండ్ నుంచి మహాత్మాగాంధీ(ఎంజీబీఎస్) లోపలికి వెళ్లడానికి ఉచిత బ్యాటరీ (ఎలక్ట్రానిక్) వాహనాలను అందబాటులోకి తెచ్చారు. ఈ వాహనాలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలు అందిస్తాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్) ఆవరణలో వికలాంగులు, వృద్ధులు, మహిళలు మరియు పిల్లలను తీసుకెళ్లేందుకు బ్యాటరీతో నడిచే కారుని ప్రవేశపెట్టినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. ఈ బ్యాటరీ కారులో ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రతి ఐదు నిమిషాలకు ఈ బ్యాటరీ కారు సీబీఎస్ నుండి ‘ఎంజీబీఎస్‘కు బయలుదేరుతుంది.
ఇది ప్రస్తుతం 5 నిమిషాల ఫ్రీక్వెన్సీలో 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది.”ఈ బ్యాటరీ కారు చార్జింగ్ కోసం బస్ స్టేషన్లో 134 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు మేనేజర్ తెలిపారు. ఈ వాహానాలలో మొత్తం 12 మంది ప్రయాణం చేయవచ్చు. గతంలో ప్రయాణికులు సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కు వెళ్లడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నిత్యం రద్దీగా ఉండటంతో రోడ్డు దాటడానికి సైతం బాగా కష్టంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమని శ్లాఘించారు. బ్యాటరీ కారులో వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణులకు, రోగులకు ప్రాధాన్యత ఇస్తారు.