హైదరాబాద్: ప్రధాని మోదీ వరంగల్ పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని, తమ పార్టీ నేతలెవరూ హాజరు కావట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లతో కలిసి మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈక్రమంలోనే ఆయన ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు.
విభజన హామీల్లో ప్రధాని మోదీ ఒక్కటి కూడా నెరవేర్చలని చెప్పుకొచ్చారు. గుజరాత్ కు రూ.20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారని.. తెలంగాణకు కేవలం 521 కోట్ల నిధులు ఇవ్వడం ఏంటని అడిగారు. తెలంగాణ పట్ల ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని.. కానీ ఈ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కాదని చెప్పారు. నేటి ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.
అంతేకాకుండా గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ హామీ ఏమైందని ప్రధాని మోదీని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. బీజేపీని, ప్రధాని మోదీని ఎందుకు విమర్శించరని ప్రశ్నించారు.
ధరణి పోర్టల్లో పదే పదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్పై కేటీఆర్ మండిపడ్డారు. ధరణి పోర్టల్ నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ నాయకుడు లేవనెత్తిన భయాందోళనలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేవంత్ ‘ఆర్ఎస్ఎస్ వ్యక్తి’ కాబట్టి, ఆయన బీజేపీ పట్ల మెతకగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్పైనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.