హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం… నగరం, దాని చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ఇప్పటికే గణనీయమైన వర్షపాతం నమోదైంది.
నిన్న ఉదయం 8 గంటల వరకు మియాపూర్లో 65.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాప్రా 63.8 మి.మీ, చెర్లపల్లి వద్ద 62.8 మి.మీ, లంగర్ హౌజ్ 60.5 మి.మీ, హైదర్నగర్ 59.5 మి.మీ, చద్రాయణగుట్ట 58.8 మి.మీ.
IMD జారీ చేసిన రెడ్ అలర్ట్ రోజంతా భారీ వర్షపాతం కొనసాగే అవకాశం ఉందని సూచిస్తుంది. ఇదే సమయంలో నివాసితులు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇంట్లోనుంచి బయటి రావొద్దని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, నీరు నిలిచిన వీధులు, అండర్పాస్ల గుండా వాహనాలు నడపడం మానుకోవాలని అధికారులు ప్రజలను కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిస్థితిని సరిదిద్దేందుకు, ఆపదలో ఉన్న నివాసితులకు సహాయం చేయడానికి అత్యవసర బృందాలను మోహరించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా తలెత్తే ఏవైనా అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి విపత్తు ప్రతిస్పందన దళం (DRF) హై అలర్ట్గా ఉంచారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు చెరువులు, రిజర్వాయర్లలో నీటిమట్టాలు పెరుగుతుండటంతో వరద ముంపునకు గురికాకుండా అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.